ఆర్థిక నేరస్థులనుకలుస్తారా: జగన్తో మోడీ భేటీపై ధ్వజమెత్తిన చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నేరుగా ప్రధాని నరేంద్ర మోడీకి గురిపెట్టి విమర్శనాస్త్రాలు సంధించారు. ఆర్థిక నేరస్థులు ప్రధాని కలవడం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.
ప్రధాని మోడీ వైఎస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కావడంపై చంద్రబాబు ఆ విధంగా వ్యాఖ్యానించారు. అదే విధంగా ప్రధాని కార్యాలయం చుట్టూ ఎ2 నిందితుడు ప్రదక్షిణలు చేయడం ఏ విధమైన సంకేతాలను అందిస్తున్నాయని విజయసాయి రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
ఓ వైపు ఇలా, మరోవైపు అలా..
ఓ వైపు ప్రధాని మోడీపై విశ్వాసం ఉందంటూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతామని వైఎస్సార్ కాంగ్రెసు నాయకులు అంటున్నారని చంద్రబాబు మరోసారి అన్నారు. మంగళవారం టిడిపి పార్లమెంటు సభ్యులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఆ విధంగా అన్నారు.
ఛీకొట్టే రోజులు దగ్గరలోనే..
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని ప్రజలు ఛీకొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చంద్రబాబు అన్నారు. టిడిపి ఎంపీలు కలిసికట్టుగా ఉండాలని, చిత్తశుద్ధితో పోరాటం చేయాలని ఆయన సూచించారు. ఇది కీలకమైన సమయమని, ఎంపీలెవరూ సభకు గైర్హాజరు కాకూడదని న్నారు.
సస్పెండ్ చేస్తే ఇలా చేయండి..
కేంద్రం నుంచి ఎంత వచ్చింది, ఇంకా ఎంత రావాల్సి ఉందనే వివరాలను ఆన్లైన్లో పెట్టామని, యూసీలు డిపిఆర్లు అందులో ఉన్నాయని, వాటిని ఎంపిలు వాడుకోవాలని ఆయన చెప్పారు. సభ నుంచి సస్పెండ్ చేస్తే వెలుపల పోరాటాన్ని ఉధృతం చేయాలని ఆయన అన్నారు.
అన్యాయం జరిగిన చోటే న్యాయం జరగాలి
విభజన చట్టం, హామీలపై సమీక్ష చేసి ప్రజలకు చెప్పాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. దేశం మొత్తానికి విషయం తెలియాలని అన్నారు. ఏ సభ సాక్షిగా ఎపికి అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరగాలని అన్నారు. ఏ పార్టీలైతే ఎపికి అన్యాయం చేశాయో వాటివల్లే న్యాయం జరగాలని కూడా ఆయన అన్నారు.