పవన్, జగన్ బీజేపీ కుట్రలో భాగమే, చిత్తుచిత్తుగా ఓడించాలి: చంద్రబాబు పిలుపు
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఐదు కోట్ల ప్రజల కోసమే తాము నవనిర్మాణ దీక్ష చేపట్టామని చెప్పారు. సోమవారం విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో చేపట్టిన నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయ, అనుబంధం రంగాలు, పథకాల అమలు తీరుపై రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఆనాడు ప్రధాని మోడీ విభజన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి.. ఇప్పుడు మాట మార్చారని అన్నారు.
మోడీని నమ్మి నేనే కాదు..
కేంద్రం సాయం కోసం ఎంతో సహనంతో ఎదురుచూశామని, హామీల సాధనకు పోరాటమే మార్గమని ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చామని చంద్రబాబు చెప్పారు. ప్రధాని మోడీ నమ్మి తానే కాదు, దేశం మోసపోయిందని ఆరోపించారు. తమ డబ్బులు తీసుకోవడానికి కూడా ప్రజలు క్యూలో నిలబడ్డారని, నోట్ల రద్దుతో ఏటీఎంలలో డబ్బులు దొరకడం లేదని అన్నారు. జీఎస్టీతో సమస్యలు తలెత్తాయని అన్నారు. కర్ణాటకలో మెజార్టీ లేకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ చూసిందని.. సుప్రీంకోర్టు తీర్పుతో దిగిపోవాల్సి వచ్చిందన్నారు.
బీజేపీ కుట్రలో భాగమైన జగన్, పవన్
ప్రస్తుతం రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాల డ్రామా నడుస్తోందని, ఎన్నికలు రాని సమయం చూసి రాజీనామాల నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నాయకులకు ధైర్యం మోడీ, బీజేపీపై పోరాడాలన్నారు. మోడీ ప్రభుత్వం ఏపీపై కుట్ర పన్నిందని, ఈ కుట్రలో భాగంగానే వైసీపీ, పవన్ కళ్యాణ్ తనపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
బీజేపీ కుట్రలు సాగవు.. పొత్తు పార్టీలను చిత్తుగా
రాష్ట్రాన్ని బలహీనపరిచే విధంగా బీజేపీ, వైసీపీ, జనసేన వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. టీటీడీని కూడా అపవిత్రం చేసే విధంగా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అయితే, ఈ కుట్రలు వేరే రాష్ట్రాల్లో చెల్లుబాటు అవుతాయోమో కానీ.. ఏపీలో సాగవని చంద్రబాబు హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
రాజీలేని పోరాటం
కేంద్రంతో రాజీ లేదని, ధర్మపోరాటం చేస్తామని అన్నారు. ఎన్ని ఇబ్బందులెదురైనా సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను వదిలిపెట్టలేదని అన్నారు. కేంద్రం, ఆర్బీఐ ఒప్పుకోకపోయినా రుణమాఫీ అమలు చేశామని, మహిళా సంఘాల రుణాలు రద్దు చేశామని చంద్రబాబు చెప్పారు. సాగునీటి పథకాలకు ప్రాధాన్యత ఇచ్చామని, రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యతలు తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు.