ఇన్ని రోజులు విదేశాల్లోనా, భయమేస్తోంది: గంటాపై బాబు ఆగ్రహం
మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు విదేశీ పర్యటనల్లోనే ఉంటే ఎలా అని మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆ శాఖ ప్రత్యేక ప్ర
అమరావతి: మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు విదేశీ పర్యటనల్లోనే ఉంటే ఎలా అని మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ల తీరుపై వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయం నుంచి శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, శాఖల కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇన్ని రోజులు విదేశాల్లో ఉంటే..
ఈ సందర్భంగా ఆ శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ దాస్లు ఇంకా విదేశీ పర్యటనలో ఉండటం ప్రస్తావనకు వచ్చింది. దానిపైన ముఖ్యమంత్రి స్పందిస్తూ.. అన్ని రోజులు విదేశాల్లో ఉంటే ఎలా అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఆగ్రహం
‘ఎవర్నైనా విదేశీపర్యటనలకు పంపాలంటే భయపడాల్సి వస్తోంది. ఎక్కడికీ పంపించకపోతే... ఏమీ తెలియకపోతే ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో కొంత ఖర్చయినా, వృథా అయినా పంపిస్తున్నాం, పది మందిని పంపిస్తే వారిలో కనీసం ముగ్గురైనా మారుతారనేది నా ఉద్దేశం...' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంగా అధికారుల తీరుపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియని, క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయకుండా ఇక్కడ కూర్చొని మాటలు చెబితే లాభం లేదన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి, అంకితభావంతో మంచి పనితీరు కనబరచకపోతే గౌరవం పొందలేమన్నారు.
భయమేస్తోంది..
‘విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్లు ఇప్పటికే పర్యటన ముగించుకుని రావాల్సి ఉంది. అయినా ఇంకా రాలేదు. విదేశాల్లో ఒక రోజు రెండు రోజులు పని ఉంటుంది. ఇన్ని రోజులు అక్కడే ఉంటే ఎలా? ఎవర్నైనా విదేశాలకు పంపించాలంటే భయపడాల్సి వస్తోంది' చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఓడీఎఫ్ రాష్ట్రంగా..
ఈ సందర్భంగా బహిరంగ విసర్జన రహిత రాష్ట్రం(ఓడీఎఫ్)గా ప్రకటింపజేసుకోవడానికి చేస్తున్న పనులను సమీక్షించారు. ఐదు నెలలే ఉంది.. రాష్ట్రాన్ని బహిరంగ విసర్జన రహితం (ఓడీఎఫ్)గా ప్రకటింపజేసుకోవడానికి మార్చిలోపు 22 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో ప్రజలందర్నీ భాగస్వామ్యం చేయాలన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ, సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన ప్రాజెక్టులు తయారు చేసే విద్యార్థులకు మార్కుల కేటాయింపు అంశాలపై చర్చ జరిగింది.