రాష్ట్రాన్ని తగలబెడతారా? కేంద్రంతో కలిసి తెలంగాణ, పవన్ కుట్రలు: జగన్పై దాడిపై ఊగిపోయిన బాబు
Recommended Video

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తీరుపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.

దాడులతో అస్థిరపరిచే కుట్ర
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగన్పై దాడి చేస్తే ప్రభుత్వాన్ని తప్పుపడతారా? అని చంద్రబాబు నిలదీశారు. ఈ రోజు దాడి జరిగిన విధానం చూస్తే ఎవరికైనా సందేహాలు రాకమానవన్నారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే జగన్ దాడి ఘటనను రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఉన్నతస్థాయిలో ఉన్న వైసీపీ అధినేత బాధ్యతాయుతంగా ఎందుకు వ్యవహరించలేదని చంద్రబాబు నిలదీశారు. కేంద్ర బలగాలు రక్షణ కల్పించడంలో విఫలం కావడం సహా ఘటన జరిగిన తర్వాత నిర్దిష్ట ప్రక్రియను పట్టించుకోలేదని మండిపడ్డారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం తీసుకోకుండా ఎలా వెళ్లారని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే దాడి.. జగన్ నాటాకాలు
కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న విమానాశ్రయంలో దాడి మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగితే సీఐఎస్ఎఫ్ సిబ్బంది సాయంత్రం 4గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. దాడి తర్వాత ప్రతిపక్ష నేత బాధ్యతారహితంగా ప్రవర్తించారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై విపక్ష నేతలు నాటకాలాడారని, ఘటనపై గవర్నర్ తీరు బాగా లేదన్నారు. ప్రభుత్వాన్ని అడగకుండా డీజీపీకి ఫోన్ చేసి నివేదిక అడుగుతారా? అని మండిపడ్డారు. నటుడు శివాజీ గతంలో చెప్పినట్టు ఆపరేషన్ గరుడ నిజంగానే జరుగుతోందని సీఎం వ్యాఖ్యానించారు.

కేంద్రం, తెలంగాణ నాటకం
‘ఘటన జరిగిన అరగంటలోనే విశాఖలో జాతీయ రహదారిపై వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. విశాఖలో ఫిన్టెక్ జరుగుతున్న సమయంలో ఇలాంటి నాటకాలు ఆడుతున్నారా? దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత జగన్పై లేదా? అక్కడే కాసేపు ఉండి దర్యాప్తులో పోలీసులకు సహకరించాల్సిన బాధ్యత లేదా? హుందాగా రాజకీయం చేయాలని ప్రతిపక్షాన్ని కోరుతున్నా. ఏపీలో భద్రత లేదని అనేందుకు కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం, జగన్ కలిసి ఆడుతున్న నాటకమిది. దీనికి బీజేపీ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. నిందితుడు నన్ను తిడుతూ.. జగన్ను పొగుడుతూ 11 పేజీల ఉత్తరం రాశాడు' చంద్రబాబు అన్నారు.

జగన్, పవన్, కేసీఆర్, బీజేపీ కలిసి కుట్రలు.. కేంద్రానికి హెచ్చరిక
‘టిట్లీ తుఫానుపై ఒక్క మాట మాట్లాడని కేసీఆర్, కేటీఆర్, కవిత.. జగన్ విషయంలో వెంటనే సానుభూతి తెలిపారు. ఏపీలో నాటకాలు కట్టిపెట్టాలని కేంద్రాన్ని కూడా హెచ్చరిస్తున్నా. విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా అడిగినందుకు ఇన్ని దాడులు చేస్తారా? జగన్, పవన్, కేసీఆర్, బీజేపీ కలిసి మాపై కుట్రలు పన్నుతున్నారు. 40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలపై జరుగుతున్న దాడి. చట్టంపై గౌరవం ఉంటే జగన్ ప్రభుత్వ ఆస్పత్రికి ఎందుకు వెళ్లలేదు? విమానాశ్రయంలో జరిగిన ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలి' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

జగన్ వీరాభిమాని దాడి చేస్తే మమ్మల్ని తప్పుపడతారా?
‘గాయపడిన వ్యక్తిని విమాన ప్రయాణానికి ఎలా అనుమతించారు. వైసీపీ వీరాభిమానినని నిందితుడు స్పష్టంగా చెప్పాడు. వీరాభిమాని దాడి చేస్తే మమ్మల్ని తప్పుపడతారా? ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని చూస్తే సహించం. నిందితుడిపై ఫిర్యాదు కూడా చేయకుండా వెళ్లిపోతే ఎలా దర్యాప్తు చేయాలి? ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా ప్రజలు తిప్పికొడతారు. ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తిని నేను. మీ దాడులకు భయపడను. రాజకీయాల్లో నేను ఎదుర్కొన్నన్ని సంక్షోభాలను ఎవరూ ఎదుర్కోలేదు. కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది' అని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రాన్ని తగలబెడతారా?
‘హింసను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించం. విమానాశ్రయంలో జరిగిన ఘటనకు రాష్ట్రాన్ని ఎందుకు తప్పుపడుతున్నారని కేంద్రంలో ఉన్న బీజేపీను నిలదీయండి. నరేంద్ర మోడీ సీఎం పదవి నుంచి వచ్చిన వ్యక్తి కాదా? ఇప్పుడున్న చాలామందితో పోలిస్తే నేను సీనియర్ లీడర్ని. అందరికంటే ముందు సీఎం అయిన వ్యక్తిని నేను. గవర్నర్ వ్యవస్థపై పోరాడిన వ్యక్తిని నేను. ఢిల్లీ స్క్రిప్టులను అమలు చేయాలని చూస్తే కుదరదు' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంతో కలిసి తెలంగాణ ప్రభుత్వం ఏపీపై కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. అధికారాలు లేకున్నా సీబీఐ డైరెక్టర్ ను కేంద్రం ఎలా తొలగిస్తుందని ప్రశ్నించారు. నిన్న విశాఖలో క్రికెట్ మ్యాచ్ జరిగింది.. ఆటగాళ్లు ఇవాళ వెళ్లే సమయంలో ఇలాంటి ఘటనలకు పాల్పడతారా? అని మండిపడ్డారు. రాష్ట్రాన్ని తగలబెడతరా? అని నిలదీశారు. చవకబారు రాజకీయాలు చేయొద్దని కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం, జగన్, పవన్లను చేయొద్దని, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications