మనుషులెవ్వరూ విమర్శించలేదు: బాబు, న్యూవిశాఖగా
విశాఖపట్నం: తుఫాను ధాటికి విపరీతంగా నష్టపోయిన విశాఖనగరాన్ని మళ్లీ పునర్నిర్మిస్తామని, అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాల విమర్శలపై తీవ్రస్థాయిలో స్పందించారు. తమ ప్రభుత్వం చేపట్టిన తుఫాను సహాయక చర్యలపై మనుషులెవ్వరూ విమర్శించలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
తుఫాను బాధితులకు పది పులిహోర పొట్లాలు ఇస్తే సరిపోతుందా అని అనడం ఏంటని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. ప్రజలకు కావాల్సిన అన్ని సహాయక చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్న ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు విమర్శించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్టోబర్ 19న విశాఖకు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు.
తుఫాను బాధితుల కోసం సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. శుక్రవారం సాయంత్రంలోగా బియ్యం రేషన్ దుకాణాలకు చేరాలని ఆదేశించినట్లు చెప్పారు. 500 మెట్రిక్ టన్నుల ఆలుగడ్డల ఉత్తరాంధ్రకు తీసుకొచ్చామని తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల బాధితులతోపాటు ప్రభావితం కాని ప్రజలకు కూడా ఆరు రకాల వస్తువులు అందిస్తున్నామని తెలిపారు. 10కిలోల బియ్యం, కిలో పప్పు, ఉప్పు, చక్కెర, లీటర్ పామాయిల్, అరకిలో కారం ప్యాకేజీగా ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇవన్ని అర్హులందరికీ అందుతాయని చెప్పారు.
ఇబ్బందుల్లో ఉన్నందునే ప్రభావితం కాని ప్రాంతాల్లో ఈ ప్యాకేజీ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలకు మెడిసిన్స్ కూడా పంపిస్తున్నట్లు తెలిపారు. తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని ఫొటోలు, వీడియో తీసి ప్రభుత్వ వెబ్సైట్ అయిన హుధుద్ పోర్టల్లో ప్రజలు అప్లోడ్ చేయవచ్చని తెలిపారు. ఫొటోలు, వీడియోల ద్వారా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తామని చెప్పారు. పరిహారం నేరుగా బాధిత ప్రజల ఖాతాకు చేరేట్లు చూస్తామని చంద్రబాబు తెలిపారు. శుక్రవారం సాయంత్రంలోగా అన్ని రేషన్ దుకాణాలు తెరుచుకుంటాయని తెలిపారు.
సహాయక చర్యలను 150బృందాలు పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో ముందు విద్యుత్ ఇచ్చేందుకు సాంకేతికను ఉపయోగించినట్లు చంద్రబాబు తెలిపారు. నీటిని కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న అధికారులు, సిబ్బందికి తాను ఇప్పుడే అభినందనలు తెలుపనని, అన్ని సహాయక చర్యలు పూర్తయ్యాకే చెప్తానని అన్నారు. నష్ట పరిహారం అందించేందుకు బీమా సంస్థలతో మాట్లాడినట్లు చెప్పారు.
నష్టపోయిన చిన్నతరహా పరిశ్రమలకు సాయమందిస్తామని తెలిపారు. ఎయిర్టెల్ తోపాటు ఇతర టెలికాం సంస్థలు రూ. 50టాక్టైంను ప్రభావిత ప్రజలకు ఉచితంగా అందించాయని చెప్పారు. తుఫానును ధైర్యంగా ఎదుర్కొన్న విశాఖ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. తుఫాను వచ్చిన 24గంటల్లో ప్రధాని విశాఖకు వచ్చి తక్షణ సాయంగా వెయ్యి కోట్లను ప్రకటించారని తెలిపారు. ప్రజల బాధలను ప్రభుత్వం అర్థం చేసుకున్నట్లే.. ప్రజలు కూడా ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల పట్ల సానుకూలంగా ఉండటం సంతోషంగా ఉందని చెప్పారు.
శుక్రవారం సాయంత్రంలోగా చెత్త తొలగింపు పనులు పూర్తవుతాయని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త వల్లే తుఫాను వచ్చినప్పుడు ఎవరూ చనిపోలేదని చెప్పారు. న్యూ విశాఖ, ప్రౌడ్ విశాఖ అనే పేరుతో విశాఖను పునర్నిస్తామని చంద్రబాబు చెప్పారు. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని, వాణిజ్యనరంగా కొనసాగుతుందని చెప్పారు. హుధుద్ కన్నా పెద్ద తుఫానుల నుంచి తట్టుకునే విధంగా విశాఖను నిర్మిస్తామని అన్నారు. విశాఖ ఎయిర్ పోర్టును కూడా నవీకరిస్తామని చెప్పారు.