జగన్ ఓ దొంగపిల్లి; 3టాయిలెట్లు కట్టలేడు..3రాజధానులు కడతాడా? చంద్రబాబు ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై, వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని దారుణంగా ధ్వంసం చేశారని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జగన్ సర్కారు పాలనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో అరాచకం రాజ్యమేలుతుందని,అభివృద్ధి శూన్యంగా రాష్ట్రం మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
అఖండ సినిమాపై చంద్రబాబు రియాక్షన్.. ఏపీ పరిస్థితులకు లింక్ పెట్టి అనూహ్య వ్యాఖ్యలు
జగన్ సర్కార్ తీరుపై చంద్రబాబు ఫైర్
3 టాయిలెట్లు కట్టలేని సీఎం జగన్ మూడు రాజధానులు కడతాడా అంటూ చంద్రబాబు జగన్ పై మండిపడ్డారు. మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయంలో అనుచరులతో కలిసి మాజీ ఐపీఎస్ అధికారి షేక్ షావలి నూర్ భాషా వర్గ నేతలు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు జగన్ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మైనారిటీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ను చేసిన సందర్భం తనకు ఎక్కువ తృప్తినిచ్చింది అని స్పష్టం చేశారు చంద్రబాబు.
అమరావతి గ్రాఫిక్స్ అన్న నేతలు హైదరాబాద్ లో చేసింది చూడాలి
తమ హయాంలో ఐటీకి ఇచ్చిన ప్రాధాన్యత వల్లే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి ఉన్నాడని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి గ్రాఫిక్స్ అంటున్న వైసీపీ నేతలు హైదరాబాద్లో తాను ఏం చేశానో చూడాలని చంద్రబాబు సూచించారు. జగన్ హయాంలో అమరావతిని నాశనం చేశారని అసహనం వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఢిల్లీలో యాచిస్తోందని మండిపడ్డారు. ఆర్థిక కష్టాల నుంచి కాపాడాలని వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి ఇప్పుడు అడుక్కుంటే అవుతుందా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ రెండు కళ్ళు అమరావతి, పోలవరం లను పొడిచేశారు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రెండు కళ్ళు అయిన అమరావతిని, పోలవరాన్ని పొడిచేసి, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని గుడ్డిగా మార్చారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అమరావతి నగర నిర్మాణం, పోలవరం గురించి అడగడం లేదని ఆక్షేపించారు చంద్రబాబు. రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని ఇంతగా భ్రష్టు పట్టించిన సీఎం దేశంలోనే మరెక్కడా లేరనీ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దు పై జగన్ హామీ ఏమైంది అని చంద్రబాబు నిలదీశారు.
జగన్ ఓ దొంగపిల్లి.. ఒక్క ఛాన్స్ ఇచ్చి ఓట్లేసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు.
హామీ ఇచ్చి నెరవేర్చని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చెప్తారో చెప్పాలి అని చంద్రబాబు ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే చెప్పుతో కొట్టండి అన్న సీఎం ఇప్పుడు ఏం చెబుతారో చెప్పాలన్నారు. జగన్ ఒక దొంగ పిల్లి అని, కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ చూడడం లేదని భావిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక్క ఛాన్స్ అని ఓట్లేసిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, జగన్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్న చంద్రబాబు, తప్పని చెప్పిన వారిపై అక్రమంగా కేసులు పెడుతూ వైసీపీ నేతలు భయాందోళనకు గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.