చంద్రబాబు ప్లాన్: వవన్ కల్యాణ్తో సై, బిజెపితో తెగదెంపులు
Recommended Video

అమరావతి: వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి, ప్రజలను సమీకరించుకోవడానికి తగిన వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుబ నాయుడు రూపొందించి అమలు చేస్తున్నారు.
ఇప్పటికిప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల నాటికి బిజెపితో తెగదెంపులు చేసుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగిన పునాదిని ఆయన తయారు చేసుకుంటున్నారు. పోలవరం వంటి ప్రధానమైన అంశాలపై ఆయన బిజెపిని చిక్కుల్లో పడేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.

పోలవరంపై చంద్రబాబు ఇలా...
పోలవరం ప్రాజెక్టు వివాదంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం మీద పైచేయి సాధించినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అడ్డంకులు కల్పిస్తుందనే విషయాన్ని ప్రజలకు చేరవేయడంలో విజయం సాధించినట్లుగా ఆ వర్గాలు భావిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబందించిన కొన్ని పనుల టెండర్లను నిలిపేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

సకాలంలో పనులు పూర్తి కావాలంటే....
పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావాలంటే కొన్ని పనులు మరో కాంట్రాక్టర్కు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంంగానే తాము కొన్ని పనులకు మరో కాంట్రాక్టరుకు అప్పగించాలని అనుకుని, టెండర్లను అహ్వానించామని, దానికి కేంద్రం ఆదేశాలు ఆటంకంగా మారాయని ఆయన వాదిస్తున్నారు. పోలవరం తాను చెప్పిన గడువులోగా పూర్తి కాకుంటే అందుకు కేంద్ర ప్రభుత్వమే కారణమనే వాదనను బలంగా వినిపించేందుకు ఆయన సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు.

పవన్ కల్యాణ్తో సై
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాపులకు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని కూడా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి నెట్టేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి అవసరమైన చట్టాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుంది. అది జరిగినా జరగకపోయినా తనకు నష్టం కలగకుండా చంద్రబాబు జాగ్రత్త పడినట్లు భావించాల్సి ఉంటుంది. తన చేతుల్లో ఉన్నది చేశానని, ఇక చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన చెప్పే అవకాశాలున్నాయి. తద్వారా కాపు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునే అవకాశం ఉంది.

ముద్రగడ కూడా మెత్తబడ్డారా....
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బిల్లును ఆమోదించిన తర్వాత కాపు నేత ముద్రగడ పద్మనాభం కూడా కాస్తా మెత్తబడినట్లు కనిపిస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మాత్రమే ఆయన అడుగుతున్నట్లు కనిపిస్తున్నారు. అవసరమైతే కాపు నేతల ప్రతినిధులతో ప్రధాని మోడీ వద్దకు తాను వస్తానని చంద్రబాబు చెప్పే అవకాశాలున్నాయి. పవన్ కల్యాణ్తో పొత్తు, కాపులకు రిజర్వేషన్ల కల్పన తమకు కోస్తా, రాయలసీమల్లోని కనీసం 8 జిల్లాల్లో తాము బలం పుంజుకుంటామని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి.

బిజెపి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..
ఆంధ్రప్రదేశ్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని బిజెపి జాతీయాధ్యక్షుడు రాజమండ్రిలో ప్రకటించి ఏడాదిన్నర అవుతోంది. ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. కొత్త ప్రెసిడెంట్ నియామకం జరిగి, టిడిపితో సంబంధాలపై స్పష్టత ఇస్తే తప్ప బిజెపి పుంజుకునే అవకాశాలు లేవు. నిజానికి, దగ్గుబాటి పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మినారాయణ వంటి ప్రధాన నాయకులు బిజెపిలోకి వచ్చినప్పటికీ వారికి తగిన కార్యాచరణ లేకుండా పోయిందనే అభిప్రాయం ఉంది.

బిసీల కోసం చంద్రబాబు....
రాష్ట్రంలో బలాలను సమీకరించుకునే వ్యూహంలో భాగంగా చంద్రబాబు బీసీలకు ఓ పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇది దాదాపుగా ఆదరణ పథకం పునరుద్ధరణ అంటున్నారు. ఈ పథకం కింద బిసీ కులవృత్తులవారికి అత్యాధునిక పనిముట్లు, సాంకేతికత అందించే పథకం. దీని ద్వారా బీసీల మనసు దోచుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారు.

నిరుద్యోగ భృతికి కసరత్తు...
పనిలో పనిగా చంద్రబాబు ప్రభుత్వం యువత కోసం నిరుద్యోగ భృతిని కల్పించాలనే ఆలోచనలో ఉంది. అదే సమయంలో యువతకు ఉపాధి అవకాశాలను పెంచే పథకాలను కూడా చేపట్టనున్నారు. తద్వారా యువతను పూర్తిగా టిడిపి వైపు తిప్పుకునే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం బహుముఖ వ్యూహాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నారు.












Click it and Unblock the Notifications