బాబు పోరు: విభజనపై పవన్, తొక్కిస్తా: కెసిఆర్పై బాబు
నెల్లూరు: కాంగ్రెసు ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించిందని, దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక్కరే పోరాటం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే, పవన్ కళ్యాణ్లో సీమాంధ్ర యువత స్ఫూర్తి కనిపిస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు. నరేంద్ర మోడీతో పాటు గురువారం నెల్లూరులో జరిగిన బహిరంగ సభలో వారు ప్రసంగించారు.
సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ వచ్చారని, మొసలి కన్నీరు కారుస్తున్నారని, రాహుల్ గాంధీని నమ్మితే మన నెత్తిన చెత్త వేసుకున్నట్లేనని చంద్రబాబు అన్నారు. కాంగ్రెసు దుర్మార్గమైన పార్టీ అని, రాహుల్ గాంధీ అసమర్థ నాయకుడని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన ప్రజలను కోరారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నోటికి అడ్డు లేకుండా పోయిందని, నోరు అదుపులో పెట్టుకోకపోతే సైకిల్ స్పీడ్ పెంచి తొక్కిస్తానని తాను కెసిఆర్ను అన్నానని చంద్రబాబు అన్నారు. కెసిఆర్ పనికిమాలిన నాయకుడని ఆయన అన్నారు. మోడీని, తనను, పవన్ కళ్యాణ్ను తిట్టే కెసిఆర్ జగన్ను ఒక్క మాట కూడా అనడని ఆయన అన్నారు.
దేశానికి మోడీ నాయకత్వం అవసరమని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసులో కలిసిపోతుందని, రాష్ట్రాన్నీ దేశాన్నీ దోచుకునేవారు రాజకీయాల్లో ఉండకూడదని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో యువత ఓట్లు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోనియా గాంధీనే జగన్కు బెయిల్ ఇప్పించారని ఆయన ఆరోపించారు. పవన్ ప్రసంగంతో యువతలో రోషం పెరిగిందని ఆయన అన్నారు. తనకు అధికారం ఇస్తే నెల్లూరును మహానగరంగా తీర్చి దిద్దుతానని ఆయన అన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం బలంగా లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. చిన్నప్పటి నుంచి తనకు కాంగ్రెసు అంటే ద్వేషమని ఆయన అన్నారు. సీమాంధ్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ఆయన అన్నారు. దేశంలో సర్దార్ పటేల్ను తాను మోడీలో చూశానని ఆయన అన్నారు. కాంగ్రెసు అధికారంలో ఉన్న ప్రతిసారీ వేర్పాటువాదం ముప్పు వస్తోందని ఆయన విమర్శించారు.
కెసిఆర్ సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తే జగన్ మాట్లాడలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు తుచ్చ రాజకీయాలు చేస్తోందని ఆయన అన్నారు. కుటుంబానికి అధికారమే తప్ప దేశం బాధ్యత కాంగ్రెసుకు పట్టదని ఆయన అన్నారు. సీమాంధ్ర గడ్డపై ఉండి తాను తెలంగాణ పోరాట సాహిత్యం చదివానని ఆయన చెప్పారు. కెసిఆర్ విషం వెదజల్లే నాయకుడని ఆయన అన్నారు. దేశాన్ని ఏకం చేసే నాయకుడి కోసం ఇన్నాళ్లు చూశానని, ఇప్పుడు దేశానికి మోడీ నాయకత్వం అవసరమని ఆయన అన్నారు.
నరేంద్ర మోడీ కూడా నెల్లూరు సభలో ప్రసంగించారు. కాంగ్రెసు పార్టీపై నిప్పులు చెరిగారు. తల్లీకొడుకుల ప్రభుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో పదేళ్లు ఉందని, రాష్ట్రానికి ఏం చేసిందని ఆయన అన్నారు. ఎసి గదుల్లో కూర్చుని అంచనాలు వేసే విశ్లేషకులు అందని ఎన్నికలు ఇవి అని ఆయన అన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదా రావడానికి వెంకయ్య నాయుడే అని ఆయన అన్నారు. మదనపల్లిలో చెప్పిన విషయాలనే ఆయన మరోసారి నెల్లూరులో చెప్పారు.












Click it and Unblock the Notifications