త్వరలో ప్రధానిని కలుస్తా...ఇంకా నో అపాయింట్మెంట్...
ప్రధానితో భేటి విషయమై జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఎగువ కాఫర్ డ్యాం జెట్ గ్రౌటింగ్ పనుల ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానితో తన సమావేశం పై స్పష్టత ఇచ్చారు.
తాను త్వరలో ప్రధానిని కలుస్తానని సిఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. అయితే పిఎంతో సమావేశానికి ఆల్రెడీ అపాయింట్ మెంట్ ఖరారైనట్లు మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో సిఎం ఆ విషయం గురించి కూడా చెప్పారు. పిఎంవో నుంచి ఇంకా అపాయింట్ మెంట్ అందలేదని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు త్వరలో ఢిల్లీలో భేటీ కానున్నట్లు సోమవారం మీడియాలో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అలాగే సమావేశం ఈ నెల 12వ తేదీన లేదంటే 17న సమావేశం జరిగే అవకాశం ఉందని ఆ కథనాల్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో సిఎం వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది. తాను ప్రధానిని కలువబోతున్నానని, అయితే తేదీ ఇంకా ఖరారు కాలేదని ఆయన వివరణ ఇచ్చారు.
Recommended Video
ప్రధాని మోడీ దాదాపు ఏడాదిన్నరగా సిఎం చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంపై పెద్దఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను ఇటీవల కలిసిన టిడిపి ఎంపీలు చంద్రబాబుతో అపాయింట్మెంట్ విషయం ప్రస్తావించగా ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారట. దీంతో వెంటనే స్పందించిన ఎపి సిఎంవో ఈ నెల 12న ప్రధాని అపాయింటుమెంటు కావాలని లేఖ రాయగా, సంక్రాంతి తర్వాత 17వ తేదీన రావాలని పీఎంవో సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ రెండు తేదీల్లో ఒకటి ఖరారు కావొచ్చని అంటున్నారు. దాదాపు 17వ తేదీనే భేటీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.