చంద్రబాబు పిలుపు- రేవంత్ పై ఎఫెక్ట్ : ఆ నేతలతో టచ్ లో - టార్గెట్ కేసీఆర్..!!
తమ్మళ్లూ వచ్చేయండి. టీడీపీ వీడిన నేతలకు చంద్రబాబు ఆహ్వానం. ఖమ్మంలో జరిగిన సభలో కనిపించిన జన సందోహంతో చంద్రబాబులో సంతోష్ కనిపించింది. చాలా కాలం తరువాత తెలంగాణలో టీడీపీ భారీ సభ నిర్వహించ గలిగింది. దీంతో, చంద్రబాబు అక్కడే తన పార్టీ పూర్వ నేతలను తిరిగి రావాలంటూ ఆహ్వానించారు. టీఆర్ఎస్ లో టీడీపీని వీడిన నేతలు ఎక్కువగా ఉన్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ సైతం టీడీపీ నుంచి వచ్చిన వారే. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ వర్సస్ వలసవాడులు కొత్త నినాదం తెర మీదకు వచ్చింది. ఇటు టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ పొలిటికల్ వార్ పీక్ కు చేరింది. ఈ సమయంలో టార్గెట్ ఏపీ వయా తెలంగాణ వ్యూహంతో చంద్రబాబు పావులు కదుపుతున్నారు. మరి..పార్టీని వీడిన ఆ నేతలు చంద్రబాబు పిలుపుకు స్పందిస్తారా. ముందుకొస్తారా..
పార్టీ పిలుస్తోంది..రా కదలిరా..
సుదీర్ఘ కాలం తరువాత తెలంగాణ గడ్డపైన టీడీపీ భారీ సభ నిర్వహించింది. చంద్రబాబు హైదరాబాద్ కేంద్రంగా తన సక్సెస్ ను చెప్పుకొచ్చారు. తెలంగాణలో ప్రతీ చోట టీడీపీ పాలన నిర్ణయాలు..ఫలితాలు కనిపిస్తాయని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తెలంగాణ టీడీపీలో కొన్ని కారణాల వలన పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేదని అంగీకరించారు.
తాను కూడా తెలంగాణ పార్టీ పైన ఇక నుంచి ఫోకస్ పెడతానన్నారు. పార్టీ నేతలకు తన సహకారం ఉంటుందని చెప్పారు. పార్టీని వీడి ఇతర పార్టీల్లో ఉన్న నేతలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ పైన తన ముద్ర ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేరని చెప్పుకొచ్చారు. రెండు రాష్ట్రాలు తిరిగి కలిసే అవకాశం లేదని..తన రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేరని వివరించారు.
ఇక, తెలంగాణలో మరో పది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ.. చంద్రబాబు టీడీపీని తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందు కోసం ఖమ్మం - నిజామాబాద్ కు చెందిన ముఖ్య నేతలతో టీడీపీ నాయకత్వం టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వారు గతంలో టీడీపీలో కీలక పదవుల్లో పని చేసి...ప్రస్తుతం క్రియాశీలక రాజకీయల్లో నామ మాత్రంగా ఉంటున్నారు.
తిరిగి వచ్చేందుకు నేతలు సిద్దమేనా..
పార్టీలోనూ ఉంటూ యాక్టివ్ గా లేని నేతలు తిరిగి క్రియాశీలకంగా మారాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ నేతలు కారణాలు ఏవైనా ఇతర పార్టీల్లోకి వెళ్లారని...వారిని తిరిగి రావాలంటూ చంద్రబాబు ఆహ్వానించారు. టీడీపీని వీడిన వారిలో ఎక్కువ మంది ఇప్పుడు టీఆర్ఎస్ లోనే ఉన్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా సమావేశమైన ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వెళ్లినవారే.
మంత్రి మల్లారెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే. టీపీసీసీ చీఫ్ రేవంత్ తో సహా ఆయన తో కాంగ్రెస్ లోని పలువురు టీడీపీ నేతలు చేరారు. ఇప్పుడు రేవంత్ తో పాటుగా ఆ నేతలకు పదవులు ఇవ్వటమే టీ కాంగ్రెస్ లో ముసలానికి కారణమైంది. వారంతా తమ పార్టీ పదవులకు రాజీనామా చేసారు. రేవంత్ నాయకత్వానికి నిత్యం పరీక్ష లు ఎదురవుతున్నాయి.
ఇప్పటి వరకు టీడీపీ యాక్టివ్ గా లేకపోవటంతో టీడీపీ సానుభూతి పరులు రేవంత్ నాయకత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. కానీ, ఇప్పుడు తెలంగాణలో టీడీపీ ఏ మాత్రం తిరిగి పంజుకున్నా.. తిరిగి నేతలు సొంత గూటికి వెళ్లినా.. ప్రభావం పడేది రేవంత్ పైనే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ పేరెత్తకపోయినా..టార్గెట్ ఫిక్స్
అటు కేసీఆర్..ఇటు చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఇద్దరి మధ్య పెద్ద యుద్దమే సాగింది. ఆ తరువాత చంద్రబాబు పూర్తిగా ఏపీకి పరిమితమయ్యారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ గెలుపునే కేసీఆర్ కోరుకున్నారనే వాదన ఉంది. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని 2019 ఎన్నికల ముందే కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ఇక, ఇప్పుడు ఏపీ కంటే ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ వర్సస్ టీఆర్ఎస్ గా వార్ కనిపిస్తోంది. ఈ సమయంలోనే బీజేపీకి స్నేహ హస్తం అందించేందుకు చంద్రబాబు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీతో స్నేహం ఏపీలో తన లక్ష్యానికి దోహదం చేసేలా చంద్రబాబు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఏపీతో పాటుగా తెలంగాణలోనూ బీజేపీ కోసం చంద్రబాబు - పవన్ జత కట్టే అవకాశం ఉంది.
అదే సమయంలో ఈ ఇద్దరి ఆంధ్ర పార్టీల నేతలుగా గులాబీ పార్టీ నేతలు ముద్ర వేసే అవకాశం ఉంది. అయినా.. ఆ ఇద్దరి లక్ష్యం ఏపీలో జగన్ ను ఓడించటం. ఇందు కోసం రానున్న రోజుల్లో టార్గెట్ ఏపీ..వయా తెలంగాణ అన్నట్లుగా సరి కొత్త రాజకీయాలు తెర మీదకు వచ్చే అవకాశం కనినిస్తోంది.