ఆ విషయంలో చంద్రబాబుకు వందకు వంద మార్కులు: బొత్స సత్యనారాయణ
అవినీతికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడుకి వందకు వంద శాతం మార్కులు వేయవచ్చని అన్నారు.
విజయవాడ: రాష్ట్రంలో టీడీపీ పాలన మొత్తం అవినీతిమయంగా మారిపోయిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అవినీతికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడుకి వందకు వంద శాతం మార్కులు వేయవచ్చని అన్నారు.
వ్యవసాయం దండగ అనే భావనలో సీఎం ఉన్నారని, అందుకే రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బొత్స విమర్శించారు. వ్యవసాయానికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం కనీస కార్యాచరణ కూడా రూపొందించుకోలేదని, రెండున్నరేళ్ల పాలనలో టీడీపీ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
చంద్రబాబు చెబుతున్న రెండంకెల వృద్ధి లెక్కల్లో తప్ప, వాస్తవంలో ఎక్కడా కనిపించడం లేదని, రాష్ట్రానికి ఇంతవరకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదని బొత్స అన్నారు. ఏపీలో వృద్ధి రేటు కన్నా క్రైమ్ రేటు వేగంగా పెరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో కేవలం 5 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదవగా.. దాన్ని 12శాతం అంటూ ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తుందన్నారు.