ఆ హైదరాబాదీ ఉద్యోగులకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యోగులకు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. ఇదే క్రమంలో రాజధాని అమరావతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో అమరావతిలో రాజధాని ప్రకటన తర్వాత హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసేందుకు ముందుకొచ్చిన ఉద్యోగులకు సీఎం చంద్రబాబు పలు ఆఫర్లు ఇచ్చారు. వాటిలో ఒకదాన్ని ఇప్పుడు మరో ఏడాది పాటు పొడిగించేందుకు వీలుగా ప్రకటన చేశారు.
హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతికి వచ్చి పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉచిత వసతి సదుపాయాన్ని కల్పిస్తోంది. దీన్ని ఇప్పుడు రాజధానిలో ఉన్న అవసరాల నేపథ్యంలో మరో ఏడాది పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి పరిధిలోకి వచ్చే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పనిచేస్తున్న హైదరాబాదీ ఉద్యోగులకు ఇది వర్తించనుంది.

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంతో పాటు అసెంబ్లీ, రాజ్ భవన్, హెచ్ వోడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న హైదరాబాద్ ఉద్యోగులకు ఈ ఉచిత వసతి సదుపాయం మరో ఏడాది పాటు కొనసాగబోతోంది. ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం 2024 జూన్ 27 నుంచి 2025 జూన్ 26 వరకూ ఈ సదుపాయం కొనసాగబోతోంది. దీంతో ఆయా ఉద్యోగులు ప్రభుత్వ ఉత్తర్వులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి పనిచేస్తున్న ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలను కూడా ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది.












Click it and Unblock the Notifications