చంద్రబాబు ఆరోగ్యంపై తాజా అప్డేట్
అమరావతి: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై జైలు అధికారులు ఆదివారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ఆయన బరువు ప్రస్తుతం 67 కేజీలు అని పేర్కొన్నారు.
విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు ఉన్న బ్యారక్లో టవర్ ఎయిర్ కండీషనర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడీషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబు వీపు, నడుము, ఛాతీ, చేతులు, గడ్డం తదితర ప్రాంతాల్లో ఎర్రటి దద్దుర్లు, పొక్కులు ఏర్పాడ్డాయి. దీంతో తీవ్రమైన దురద ఏర్పడిందని రాజమండ్రి జీజీహెచ్ ఛర్మ వైద్య నిపుణులు డాక్టర్ జీ సూర్యనారాయణ, డాక్టర్ సీహెచ్ వీ సునీత తెలిపారు.

చంద్రబాబు ఛాతీ, వీపు, పొట్ట, నడుము భాగాల్లో ఎర్రటి దట్టమైన దద్దర్లు, పొక్కులు, గెడ్డంపై ఎర్రటి దద్దుర్లు గమనించామన్నారు. రెండు అరచేతుల్లోనూ చీము పొక్కులు చితికిపోవడం వల్ల దురద, శరీరమంతా తెల్లటి పొక్కులు, కొన్ని ప్రాంతాల్లో వేడి కురుపుల వల్ల ఇబ్బంది పడుతున్నారని వైద్యులు జైలు అధికారులకు నివేదించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించగా.. చంద్రబాబు ఉన్న బ్యారక్లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో చంద్రబాబు బ్యారక్లో టవర్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. మరోవైపు, చంద్రబాబును కావాలని ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
కాగా, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు.. పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ లభించలేదు. మరోవైపుపు, చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జగన్ సర్కారు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలోనూ ఐటీ ఉద్యోగులు, టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసి వేధిస్తున్నారని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications