కసితో, కక్షతో పనిచేస్తాం, మోడీ సహకరిస్తారు: చంద్రబాబు
విశాఖపట్టణం, ఆగస్టు 15: మనం కోరుకున్న విభజన కాదని, అయినా కసితో కక్షతో పనిచేసి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుదామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు ధీటుగా ఎపి అభివృద్ధి చెందే వరకు కేంద్రం సహాయం అందించాలని ఆయన అన్నారు.
విభజన తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖలోని ఆర్కే బీచ్లో దేశ 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా, పద్ధతి లేకుండా విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల కలిగిన నష్టాలను అధిగమించి, ఇతర రాష్ట్రాలతో పోటీ పడేవరకు కేంద్రం తమకు అన్ని విధాలా సహకరించాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తగిన సహకారం అందజేస్తారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.
గతంలో కరెంట్ కోతలతో విలవిలలాడిన ఏపీని విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దగలిగామన్న ముఖ్యమంత్రి, పోలవరం పూర్తికావడానికి మరో నాలుగైదేళ్లు పడుతుందన్నారు. అయితే, అంతకన్నా ముందే కృష్ణా - గోదావరి నదీ జలాలను అనుసంధానిస్తామని, దానిలో భాగంగానే పట్టిసీమ ఎత్తిపోతలను ప్రారంభించామని చెప్పారు. పట్టిసీమను ఈరోజు జాతికి అంకితం చేస్తున్నామని వివరించారు.
నదులను అనుసంధానం చేసుకుని ఏపీని కరువురహిత రాష్ట్రంగా చేస్తామంటూ తద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతాని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్తో ముడిపడిన ముంపు మండలాలను ఏపీలో కలిపిన ఘనత ఎన్డీయేదేనని చంద్రబాబు అన్నారు. రూ.25వేల కోట్ల మేర రైతుల రుణాలు మాఫీ చేశామన్నారు.ఎంతోమంది త్యాగాల ఫలితమే నేడు మనం చూస్తున్న భారతదేశమని ఆయన అన్నారు.

స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగ సమాజాన్ని పీడిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల నుంచి గట్టెక్కేందుకు అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తామన్నారు. అందుకు నిదర్శనంగానే విశాఖపట్టణంలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
బ్రిటిష్ పాలకులపై అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేసిన నేల.. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని నినదించిన నేల ఇదేనని ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ నిరుడు ఈ మహానగరాన్ని అతలాకుతలం చేసిన హుద్హుద్ తుఫాను వల్ల ప్రాణనష్టం జరగకుండా చూశామన్నారు. తొమ్మిది రోజుల పాటు బస్సులో ఉండి సహాయ చర్యలను పర్యవేక్షించామని చెప్పారు.












Click it and Unblock the Notifications