అమెరికాలో బాబుకు ప్రతిష్టాత్మక అవార్డు: జగన్ లాంటి వ్యక్తి ఉండడని ఉమ ఫైర్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశాల్లో కష్టపడుతుంటే.. తప్పుడు ఈమెయిల్స్ పంపి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
జగన్ లాంటి వ్యక్తి ఎక్కడా ఉండడు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికాలో అవార్డు అందుకోవడం రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. జగన్లా దిగజారుడు రాజకీయాలకు పాల్పడే ప్రతిపక్ష నేత ఎక్కడా ఉండరని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో జగన్ ప్రతిపక్షంలో కూడా ఉండరని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆగస్టు 15 నాటికి పురుషోత్తమ ప్రాజెక్టును జాతికి అంకితం ఇస్తామని ఆయన చెప్పారు.
అమెరికాలో బాబుకు అవార్డు
అమెరికాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదో రోజు పర్యటన ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా యునైటెడ్ స్టేట్స్ ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్ఐబీసీ) రెండో వార్షిక పశ్చిమ తీర సదస్సులో ‘ట్రాన్స్ఫార్మేటివ్ సీఎం' పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం చంద్రబాబువరుస ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు. ఏపీని క్లౌడ్ హబ్గా రూపొందించడంతో ప్రభుత్వానికి సహకారం అందించేందుకు నుటనిక్స్ సంస్థ ముందుకొచ్చింది. మరో రెండు నెలల్లో దీనిపై స్పష్టమైన రోడ్మ్యాప్, ప్రాజెక్ట్ రిపోర్ట్తో వస్తామని సంస్థ ప్రతినిధులు సీఎంకు తెలిపారు.
వెంటనే స్పందించిన బాబు
అనంతరం పట్రా కార్ప్ సీఈవో జాన్ ఎస్ సింప్సన్తో చంద్రబాబు సమావేశమయ్యారు. విశాఖలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ అమెరికన్ బీపీవో సంస్థ విస్తరణ పట్ల ఆసక్తి కనబరుస్తోంది. విశాఖలో ఇప్పటికే 1500 ఉద్యోగాలు కల్పించిన సంస్థ స్థలం కొరత కారణంగా నయా రాయ్పూర్కు 500 ఉద్యోగాలు తరలిపోయిన విషయాన్ని ప్రస్తావించింది. విశాఖలో తగిన స్థలం ఉంటే మరో 500 ఉద్యోగాలు కల్పించేవాళ్లమని స్పష్టం చేసింది. వెంటనే స్పందించిన చంద్రబాబు ఈ సంస్థకు టెక్ మహీంద్రా బిల్డింగ్ కేటాయించాలని ఏపీఐఐసీని ఆదేశించారు.
వరుస భేటీలు.. బాబుకు ప్రశంస
తర్వాత వీసా కార్డ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అంబాసిడర్ డెమెట్రియస్ మరంటీస్ , బెల్ కర్వ్ ల్యాబ్స్లో ప్రతినిధులోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ తర్వాత మొబిలిటీ ఇన్ఫాస్ట్రక్చర్ గ్రూప్ సీఎండీ డాక్టర్ రవీంద్ర వర్మతో భేటీ అయ్యారు చంద్రబాబు. అమరావతి నిర్మాణం, అనంతపురం-అమరావతి ఎక్స్ప్రెస్ వే , రాయ్పూర్-విశాఖ హైవేల నిర్మాణాలపై ఈ సంస్థ ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. అనంతరం ‘సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ ఫార్మేషనల్ జర్నీ టూవర్డ్స్ ఏ హ్యాపీ స్టేట్'అనే ద్వైపాక్షిక సదస్సులో పాల్గొని ప్రసంగించారు. సీఎం కోర్ డ్యాష్ బోర్డును వినియోగించుకుంటున్న తీరును ప్రత్యక్షంగా చూసిన అమెరికా పారిశ్రామిక వేత్తలు ప్రశంసించారు.