జంప్ జిలానీలతో చంద్రబాబుకు తలనొప్పి: జగన్కు కలిసొస్తుందా?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఖాళీ చేసి నాలుగో రాజ్యసభ సీటును కూడా సొంతం చేసుకోవాలనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వ్యూహం బెడిసి కొట్టడమే కాకుండా కొత్త తలనొప్పి వచ్చి పడింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న చాలా చోట్ల తెలుగుదేశం పార్టీలో గ్రూపులు చోటు చేసుకోవడం, అవి ముదిరి పాకాన పడడం కనిపిస్తోంది.
ఈ గ్రూప్ తగాదాలతో మొదటికే మోసం వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. తనకు కావాల్సినంత మంది శాసనసభ్యులను ఉంచుకుని మిగతా వారిని వైయస్ జగన్ స్వయంగా టిడిపిలోకి పంపించారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. జగన్ పాచిక పారిందని అంటున్నారు. ఇందులో పూర్తిగా వాస్తవం ఉందని చెప్పలేం గానీ మొత్తంగా నాలుగో రాజ్యసభ సీటును దక్కించుకోవాలనే చంద్రబాబు ప్రయత్నం మాత్రమే విఫలమైంది.
బిజెపి సలహా కారణంగానే టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాలుగో అభ్యర్థిని నిలబెట్టలేదనే ప్రచారం సాగుతోంది. అయితే నాలుగో అభ్యర్థిని నిలబెట్టాలా, వద్దా అనే విషయాన్ని చర్చించడానికి వైసిపి నుంచి టిడిపిలోకి వచ్చిన 17 మంది శాసనసభ్యులతో ఆయన సమావేశమైన రోజే విషయం తేలిపోయింది. అభ్యర్థిని పెట్టడం లేదని నేరుగా చెప్పకుండా ఆ 17 మంది ఎమ్మెల్యేలకే శానససభ్యుల నిర్ణయానికే నాలుగో అభ్యర్థి విషయాన్ని వదిలేసినట్లు చెప్పారు.

కాగా, మే చివరి నాటికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఖాళీ అవుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు, టిడిపి నాయకులు చెబుతూ వచ్చారు. తాజాగా, గురువారంనాడు తాను ముఖ్యమంత్రి సమక్షంలో టిడిపిలో చేరుతున్నట్లు కందుకూరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే పోతుల రామారావు ప్రకటించారు. కార్యకర్తల కోరిక మేరకు పార్టీ మారుతున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా ప్రకాశం జిల్లాకే చెందిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్రెడ్డి బుధవారంనాడు టిడిపిలో చేరారు. దాంతో టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యేల సంఖ్య 19కి చేరుతుంది.
ఇంకా ఎంత మంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తారనేది ఇప్పుడే తేలే విషయం కాదు గానీ, జంపి జిలానీలతో మాత్రం చంద్రబాబుకు తలనొప్పి తప్పడం లేదు. సర్దుబాటు చేసుకోవాలని చంద్రబాబు చెప్పినప్పటికీ వైసిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు, మొదటి నుంచి టిడపి నాయకులకు మధ్య పలు నియోజకవర్గాల్లో పొత్తు కుదరడం లేదు.
ప్రకాశం, పశ్చిమ గోదావరి, కర్నేూలు, కడప జిల్లాల్లో వైసిపి నుంచి వచ్చిన శానససభ్యులకు, స్థానిక నేతలకు మధ్య సయోధ్య కుదరకపోవడమే కాకుండా ఇరు వర్గాలు తగాదాలకు దిగుతున్నాయి. ఈ తగాదాలు పెచ్చరిల్లే అవకాశం కూడా ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే సర్దుబాటుకు ఏమైనా అవకాశం ఉంటుందేమో గానీ, ఇదే పరిస్థితి కొనసాగితే తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల నాటికి తీవ్రమైన సమస్యను ఎదుర్కోవచ్చు. ఇది వైయస్ జగన్కు లేదా కొత్తగా వచ్చే (వస్తే) పవన్ కల్యాణ్ పార్టీకి ఉపయోగపడవచ్చు.












Click it and Unblock the Notifications