చంద్రబాబుకు కలెక్టర్ నివేదిక షాక్: రాజమండ్రి ఘటనతో చిక్కులు?
రాజమండ్రి: గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 27 మంది మరణించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చిక్కులు తెచ్చే పెట్టేట్లు కనిపిస్తోంది. చంద్రబాబు కారణంగానే ఆ ప్రమాదం సంభవించిందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ కేంద్రానికి పంపించిన నివేదిక ఆయనకు షాక్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
కాలయానప వల్లే తొక్కిసలాట జరిగిందని, పుష్కరాలలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు రెండు రోజుల ముందే రాజమండ్రికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారని, 14వ తేదీ తెల్లవారుజామునే అధిక సంఖ్యలో భక్తులు ఘాట్కు చేరుకున్నారని, పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు ఉత్సాహంగా ఎదురు చూశారని అంటూ చంద్రబాబు సహా, వీఐపీ, వీవీఐపీలు 6.26 గంటలకు మొదటి పుష్కరస్నానాలు ఆచరించారని నివేదికలో చెప్పారు.
అప్పటికే వేడుక ప్రారంభం కోసం పెద్ద ఎత్తున భక్తులు నిరీక్షించారని, చంద్రబాబు అటు నుంచి వెళ్లిపోయిన అనంతరమే ఉదయం 8.30 గంటలకు భక్తులు అన్ని వైపుల నుంచి ఘాట్ వద్దకు చొచ్చుకొచ్చారని, ఈ సమయంలో పోలీసులు భక్తులను నియంత్రించ లేకపోయారని కలెక్టర్ తన నివేదికలో చెప్పారు.
ప్రమాదంపై కలెక్టర్ చెప్పిన విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని అంటున్నారు. వీఐపీలంతా రాజమండ్రిలో కేంద్రీకృతం కావడం వల్ల జిల్లా యంత్రాంగం, పోలీసు వ్యవస్థ మొత్తం వారి భద్రత, సేవలపై కేంద్రీకరించాల్సి వచ్చిందని కలెక్టర్ నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం.
చంద్రబాబు వీఐపీ ఘాట్లో కాకుండా సామాన్య జనం స్నానాలు ఆచరించే ఘాట్లో ఎక్కువసేపు గడపడం, ఆ తర్వాత ఒక్కసారిగా గేట్లు తెరవడం తొక్కిసలాటకు కారణమన్న విషయాన్ని కలెక్టర్ ప్రస్తావించినట్లు చెబుతున్నారు. చంద్రబాబు సామాన్యజనం ఉండే ఘాట్కు రావడానికి ఓ ప్రచార చిత్రం షూటింగ్ కోసమేనని కూడా ప్రచారంలో ఉంది. ఎపిపిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఇదే విమర్శ చేస్తున్నారు.
దాని గురించి కూడా కలెక్టర్ నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రాజమండ్రి ఘోర దుర్ఘటనకు కారణం వీఐపీలేనని కలెక్టర్ స్పష్టంగా నివేదికలో చెప్పినట్లు సమాచారం. ఆ నివేదిక అంశాలు బయటకు వస్తే చంద్రబాబుకు చిక్కులు తప్పవని అంటున్నారు.