చరిత్రలో.. బాబు వినూత్న ఐడియా: రాజధాని స్థూపంలో ధాన్యం.. వందల ఏళ్లుండేలా
గుంటూరు: రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న ఆలోచనలు చేస్తోంది. మట్టి, కలశాలతో స్థూపాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అలాగే, ఏపీలోని అన్ని గ్రామాలు... అంటే 16వేల గ్రామాల నుంచి తెచ్చిన ధాన్యంను స్థూపంలో ఉంచాలని యోచిస్తోంది.
స్థూపంలో ధాన్యం ఉంచితే... వందల ఏళ్ల వరకు అందులో నిలువ ఉండే అంశం పైన ఏపీ ప్రభుత్వం నిపుణుల సలహాలు తీసుకుంటోంది. ఈ విషయాన్ని మంత్రి పి నారాయణ శుక్రవారం చెప్పారు. అన్ని గ్రామాల నుంచి తెచ్చిన మట్టి, కలశాలతో స్థూపం ఏర్పాటు చేస్తారు. ఈ స్థూపంలో అన్ని గ్రామాల ధాన్యం ఉంచనున్నారు.
మంత్రి నారాయణ ఇంకా మాట్లాడుతూ.... శంకుస్థాపన వేదిక వద్ద 200 ఎకరాల భూమిని చదును చేయిస్తున్నామని చెప్పారు. సాయంత్రానికి చదును పనులు పూర్తవుతాయన్నారు. రేపు సాయంత్రంలోగా ఆహ్వాన పత్రికల ముద్రణ పూర్తవుతుందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వాన పత్రికను నిర్ణయించారన్నారు. నవంబర్ 1 నుంచి ఆన్ లైన్లో టౌన్ ప్లానింగ్ అనుమతులు ఉంటాయని నారాయణ చెప్పారు. 13 జిల్లాల నుంచి తెచ్చిన ధాన్యంతో స్థూపం నిర్మిస్తామన్నారు.
రైతులు స్వచ్చంధంగా ఇచ్చారు: చంద్రబాబు
రైతులు 33వేల ఎకరాలను స్వచ్చంధంగా ఇచ్చారని సీఎం చంద్రబాబు చెప్పారు. తాము పట్టిసీమ తొలి దశ పూర్తి చేశామన్నారు. గోదావరి - కృష్ణా నదులను అనుసంధానం చేశామన్నారు. రాజధాని నిర్మాణానికి సింగపూర్ను ప్లాన్ అడిగామన్నారు. కొత్త రాష్ట్రంలో ఇబ్బందులను అధిగమించవలసి ఉందని చెప్పారు. దసరా పర్వదినం నాడు రాజధాని శంకుస్థాపన చేస్తున్నామన్నారు.