"జగన్ ను అవమానించి పైశాచికానందం పొందుతోన్న బాబు"
హైదరాబాద్ : పుష్కర ఆహ్వానాల విషయంలో ప్రతిపక్ష నేత జగన్ ను అవమానించారని ఆరోపిస్తూ ఏపీ సీఎం చంద్రబాబుకు చురకలంటిస్తున్నారు వైసీపీ నేతలు. పుష్కరాలను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే పుష్కరాలు ప్రారంభమయ్యాక గానీ జగన్ కు ఆహ్వానం పంపించలేదని మండిపడ్డారు వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారథి.
ప్రోటోకాల్ ను పట్టించుకోవాలన్న కనీస విషయం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించిన పార్థసారథి.. జూనియర్ ఆర్టిస్టుల దగ్గరి నుంచి మెగాస్టార్ వరకు అందరికీ ఆహ్వానం పంపిన చంద్రబాబు, జగన్ కు మాత్రం పుష్కరాలు ప్రారంభమయ్యాక ఆహ్వానం పంపించి ఆయన్ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతను అవమానించడం చంద్రబాబు పైశాచిక ఆనందంగా అభివర్ణించిన పార్దసారథి, డ్రామాలు ఆపేయాలని చంద్రబాబును హెచ్చరించారు.
పుష్కరాలేమైనా చంద్రబాబు ఇంటి వ్యవహారమా.. అని నిలదీసినపార్థసారథి కొత్తగా పుష్కరాలు వచ్చినట్లు చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అనాదికాలం నుంచి వస్తోన్న పుష్కరాలను చంద్రబాబు రాజకీయం చేసేశారని విమర్శించారు పార్థసారథి. పుష్కర స్నానాల కోసం తాము ముందే ఏర్పాట్లు చేసుకున్నా.. కొన్ని అనివార్య కారణాల వలన జగన్ పుష్కర స్నానం ఈ నెల 18కి వాయిదా పడిందని చెప్పుకొచ్చారు.