ఎక్కువమంది పిల్లలను కనండి : చంద్రబాబు, 'ఎందుకూ.. సులభ్ కాంప్లెక్సుల్లో..!'
విజయవాడ : ఏపీలో జనాభా తగ్గిపోతుండడం పట్ల విచారం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా చదువుకున్న యువత పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపకపోవడంతో, భవిష్యత్తులో యువతరం తగ్గిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడలోని గేట్ వే పార్క్ వేదికగా ఐరాస అనుబంధ సంస్థ యూనిసెఫ్-ఏపీ లెజిస్లేటివ్ సంయుక్తంగా నిర్వహించిన "స్టేట్ సింపోజియం చైల్డ్ న్యూట్రీషియన్" సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జనాభా తగ్గిపోవడానికి కారణం చదువుకున్న వారు స్వార్థపూరితంగా ఆలోచించడమేనని అన్నారు.

ప్రపంచంలో జననాల రేటు తగ్గిపోయిన కారణంగా.. పలు దేశాలు వృద్ధాప్యంతో ఇబ్బందులను ఎదుర్కోక తప్పట్లేదని, ఏపీలోని విద్యావంతుల్లో మార్పు రాకపోతే రాష్ట్రం కూడా ఈ తరహా భవిష్యత్తు కష్టాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. చదువుకున్నవారు పిల్లలను కనకపోవడం లేదా ఒక్కరితోనే సరిపెట్టుకోవడం వల్లే ఏపీలో ఈ సమస్య తలెత్తుతోందన్నారు.
ఇక రాబోయే పదేళ్ల కాలంలో ఏపీని పోషకహార లోప రహితంగా తీర్చిదిద్దబోతున్నట్టుగా చెప్పిన సీఎం చంద్రబాబు ఇందుకోసం రాష్ట్రంలో న్యూట్రిషియన్ మిషన్ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. న్యూట్రిషియన్ మిషన్ లో భాగంగా రాష్ట్రంలో పౌష్టికాహార సమస్యను మొత్తం మూడు విభాగాలుగా విభజించి, రాబోయే ఆరు నెలల్లో పరిష్కారానికి కావాల్సిన చర్యలు చేపడుతామని చెప్పారు.
హైదరాబాద్ : 'విద్యావంతులు పిల్లలను కనడానికి ఇష్టపడడం లేదు.. ఎక్కువ మంది పిల్లలను కనాలి' అంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. రాష్ట్ర ప్రజల స్థితిగతులను ఇప్పటికే పాతాళానికి తొక్కేసిన చంద్రబాబు ఎక్కువ మంది పిల్లలను కనండి అంటూ పిలుపునివ్వడం ఎంతవరకు సమర్థనీయమని ప్రశ్నించారు భూమన.
ఈ విషయంలో చంద్రబాబు వైఖరిని తప్పుబట్టిన భూమన.. చంద్రబాబు వ్యవహారం కన్యాశుల్కంలో గిరీశం ని తలపిస్తోందని ఎద్దేవా చేశారు. తోచిందేదో మాట్లాడే సీఎం చంద్రబాబు మాటలు వింటే.. 'పేద వర్గాల పిల్లలంతా సులభ్ కాంప్లెక్స్ పనివాళ్లు గానో, లేక కూలీ అవతారమో' ఎత్తాల్సి వస్తుందని చెప్పారు. ఎప్పుడూ బుల్లెట్ లా ముందుకెళ్తాం అని మాటలు చెప్పే చంద్రబాబు నిత్యవసరాల ధరలను కూడా అంతే వేగంతో ఆకాశాన్నంటేలా చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. మరిన్ని వ్యాఖ్యలు చేసిన భూమన, చంద్రబాబు కుటుంబం పాల్పడుతున్న అవకతవకల గురించి రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయిందని అందుకే కొత్త ఓటర్లను తయారు చేయించి, మాయ మాటలతో వారిని నమ్మించి లోకేష్ ని సీఎం చేయాలనే కుట్రపూరిత వ్యవహారంతోనే ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు చెబుతున్నారంటూ విమర్శించారు భూమన.












Click it and Unblock the Notifications