నామినేటెడ్ పదవులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు-రాకపోతే అలా, వచ్చాక..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలల్లోపే రెండు విడతలుగా నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేసినా ఇంకా సొంత పార్టీ టీడీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతుండటంపై సీఎం చంద్రబాబు ఇవాళ స్పందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో తాజాగా జరిగిన సభ్యత్వ నమోదు డ్రైవ్ వివరాలు తెలుసుకున్న చంద్రబాబు.. ఆఫీసుకు వచ్చిన సాధారణ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతులు కూడా స్వీకరించారు.
సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. టీడీపీ సభ్యత నమోదు 73లక్షలకు చేరుకుందన్నారు. రికార్డు స్ధాయిలో సభ్యత్వ నమోదు చేసిన క్యాడర్, నాయకులకు అభినందనలు తెలిపారు. సభ్యత్వ నమోదులో టాప్ 5లో రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. కొత్త సభ్యత్వాలకు తోడు పెద్ద సంఖ్యలో యువత, మహిళల సభ్యత్వాలు నమోదయ్యాయన్నారు.

క్యాడర్ సంక్షేమంతో పాటు అందరి ఎదుగుదలకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పనితీరు ఆధారంగా గుర్తింపు ఉంటుందన్నారు. పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదన్నారు. ప్రజలు, పార్టీకి సేవ చేయకుండా పదవులు ఇమ్మనడం సరికాదని పార్టీలో నామినేటెడ్ పోస్టులు రాని వారికి చురకలు అంటించారు. కష్టపడనిదే ఏదీ రాదనే విషయం ప్రతిఒక్కరూ గ్రహించాలన్నారు.
కొందరు పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని, మరికొందరు ఎమ్మెల్యేలు అయ్యామని నిర్లక్ష్యం చేస్తున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ వల్లే ఏ పదవైనా అని గ్రహించి ప్రవర్తించాలన్నారు. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారన్నారు.












Click it and Unblock the Notifications