అవసరమైతే జగన్తో ఆలింగనం, బాబు ఎలాంటివాడంటే: ఓటుకు నోటును లాగిన పవన్ కళ్యాణ్
Recommended Video
శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పోరాట యాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగింది. జనసేనాని నరసన్నపేట, అక్కడి నుంచి పాతపట్నం చేరుకున్నారు. పాతపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కవాతు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం నుంచి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులను, వారసత్వ రాజకీయ నాయకులను తరిమేద్దామన్నారు.
కేంద్రం విభజన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విభజన హామీల విషయంలో బీజేపీ, టీడీపీలది తప్పు ఉందన్నారు. నాలుగేళ్లలో 36సార్లు మాట మార్చారన్నారు. ప్రత్యేక హోదా కోసం జనసేన చిత్తశుద్ధితో పోరాటం చేస్తోందని చెప్పారు. ఏపీకి హోదా ఇస్తేనే న్యాయం జరుగుతుందన్నారు.
పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే
ఇసుక మాఫియా పెరిగిపోయిందని పవన్ మండిపడ్డారు. శ్రీకాకుళంలో ఉన్న పాలకులను పెకిలించి, బద్దలు కొట్టి తీరాలని వ్యాఖ్యానించారు. భూమాతకు, భూదేవికి గౌరవం ఇవ్వకుంటే పాతాళానికి పోతారని హెచ్చరించారు. గిరిజనులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే అందరూ భాగస్వాములు కావాలని జనసేనాని వ్యాఖ్యానించారు.
జనసేన సభలకు సీఎం అడ్డు, ఎమ్మెల్యేల్ని, కుటుంబాలను బహిష్కరించాలి
నేను శ్రీకాకుళంలో ఎందుకు పుట్టలేదనిపిస్తోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన వల్లే టీడీపీ అధికారంలో ఉందన్నారు. జనసేన సభలకు ముఖ్యమంత్రి అడ్డుపడుతున్నారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. వివక్ష, దోపిడీకి గురవుతున్న వాళ్ల పక్షన తన పోరాటం ఉంటుందన్నారు. ఇప్పుడుకున్న ఎమ్మెల్యేలను, వారి కుటుంబాలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఏపీ కబ్జాల పాలు కావొద్దని భావించా
రాజకీయ, సామాజిక మార్పును జనసేన కోరుకుంటోందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అడవి తల్లి బిడ్డలకు, గంగమ్మ తల్లి బిడ్డలకు మధ్య ప్రభుత్వం గొడవ పెడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ కబ్జాల పాలు కాకుండా ప్రభుత్వం ఏర్పాటు కావాలని తాను భావించానని, అందుకే తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చానని చెప్పారు. కానీ అలా జరగడం లేదన్నారు. వంశధార బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. పునరావాసం కల్పించడంలో విఫలమయ్యారన్నారు. రాత్రికి రాత్రి ఇళ్లు కూల్చారన్నారు. నిర్వాసితులకు వెంటనే పరిహారం ఇవ్వాలన్నారు. ఈ ప్రభుత్వంలో మానవత్వం చచ్చిపోయిందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇసుక మాఫియా పెరిగిపోయిందన్నారు. శ్రీకాకుళంలో ఉన్న పాలకులను పెకిలించాలని, బద్దలు కొట్టి తీరాలన్నారు.
ఓటుకు నోటు కేసులో భయపడుతున్నారు
పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆముదాలవలస కవాతులో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కేంద్రానికి భయపడుతున్నారని చెప్పారు. శ్రీకాకుళం ఎమ్మెల్యేలు, మంత్రి అచ్చెన్నాయుడు జనసేన పార్టీ కార్యకర్తలను వేధించవద్దని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ అన్నారు. పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో ఇసుక మ్యూజియం వచ్చేలా ఉందన్నారు. ఏపీలో ఎక్కడ భూమి కనిపించిన టీడీపీ నేతలు లాగేసుకుంటున్నారని ఆరోపించారు.
అవసరమైతే జగన్తో బాబు ఆలింగనం
భూమిని, మట్టిని దోచుకునే వారు మట్టిలో కలిసిపోవాలని పవన్ అన్నారు. ఎవరికైనా పార్టీల జెండా కంటే జాతీయ జెండా ముఖ్యమన్నారు. వంశధార ప్రాజెక్టు పూర్తి కాకుండానే అక్కడి ప్రజలను మెడపట్టి గెంటేశారన్నారు. ఎక్కడకెళ్లినా అగ్రిగోల్డ్ బాధితులు కనిపిస్తున్నారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు పూర్తి మద్దతు వస్తే ఉద్యోగుల సీపీసీ స్కీంను పూర్తిగా రద్దు చేస్తామన్నారు. చంద్రబాబుకు వాడుకొని వదిలేయడం అలవాటు అని, అవసరమైతే ఆయన జగన్ను కూడా ఆలింగనం చేసుకుంటున్నారు. 2019లో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు.
సీఎం కావాలంటే చొక్కా నలగాలి, బాధలు చూసి సినిమాలు వదిలేశా
ప్రతి సభలోను జనసేన కార్యకర్తలు, అభిమానులు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. దీనిపై పవన్ మాట్లాడుతూ... మీరు నినాదాలు చేస్తే సీఎం కాలేమన్నారు. చొక్కా నలగాలి, చెమట పట్టాలి, కష్టపడి పని చేయాలన్నారు. తాను అధికారం ఆశించి రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజల బాధలు చూసి సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. జనసేన, ప్రజలు రోడ్ల పైకి వస్తున్నారంటే చంద్రబాబు నిర్లక్ష్యమే కారణం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయవద్దన్నారు. తాము చేస్తోంది నిరసన కవాతు అని, కడుపు మండి చేస్తున్న కవాతు అన్నారు.