'జగన్లా బాబు ఫ్యాక్షనిస్ట్ కాదు': 'పిచ్చిరాతల జోగయ్య అరెస్ట్ చేయాల్సిందే'
గుంటూరు: మాజీ పార్లమెంటు సభ్యుడు హరిరామ జోగయ్య మతిభ్రమించి పేరు కోసం పిచ్చిరాతలు రాశాడని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మంగళవారం మండిపడ్డారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు గురించి అందరికీ తెలుసునన్నారు. ఆయన నైజం ప్రజలకు తెలుసునని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలా చంద్రబాబు ఫ్యాక్షన్ నాయకుడు కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతలను కాపాడటంలో దేశంలోనే పేరుగాంచిన నాయకుడు మన ముఖ్యమంత్రి అన్నారు.
హత్యా రాజకీయాల సంస్కృతిని చంద్రబాబు ఎప్పుడూ ప్రోత్సహించరని, ప్రోత్సహించలేదన్నారు. అలాంటి నాయకుడి పైన మచ్చ వేయాలనే దుర్మార్గపు ఆలోచన చేస్తే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ప్రజలు ఇలాంటి వాటిని హర్షించరన్నారు. ఇప్పటికైనా హరిరామ జోగయ్య తన పద్ధతిని మార్చుకోవాలన్నారు.
జోగయ్యపై కేసు నమోదు చేయాలి: అచ్చెన్నాయుడు
హరిరామ జోగయ్య పైన కేసు నమోదు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడారు. ఆత్మకథ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠకు భంగం కలిగే వ్యాఖ్యలు చేసిన హరిరామజోగయ్యను అరెస్టు చేయాలన్నారు.
ఆత్మకథ పేరిట ఇష్టం వచ్చినట్టు రాసే రాతలకు అడ్డుకట్ట వేయాలంటే ఆయనను అరెస్టు చేయడమే సరైనదన్నారు. కాగా, వంగవీటి రంగా హత్యలో ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందని హరిరామజోగయ్య 'అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం' పేరిట రాసిన ఆత్మకథలో పేర్కొన్న విషయం తెలిసిందే.