సీమాంధ్ర: జగన్, చంద్రబాబు సహా హేమాహేమీలు
హైదరాబాద్: సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్)లో బుధవారం పోలింగ్కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్రానికి చెందిన హేమాహేమీలతో పాటు కేంద్ర మంత్రులు పోటీ చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శాసనసభకు పోటీ చేస్తుండగా, కేంద్ర మంత్రులు కిశోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి, పళ్లంరాజు లోకసభకు పోటీ చేస్తున్నారు.
మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఈసారి బిజెపి నుంచి రాజంపేట లోకసభ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. ఆమె సోదరుడు, చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి చంద్రబాబు మరోసారి పోటీ చేస్తున్నారు. 1989 నుంచి ఆయన ఈ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైయస్ జగన్ పులివెందుల నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభకు పోటీ చేస్తున్నారు. ఆయన తల్లి వైయస్ విజయమ్మ విశాఖపట్నం లోకసభ సీటు నుంచి పోటీ చేస్తున్నారు.
కిశోర్ చంద్రదేవ్ అరకు లోకసభ సీటు నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. పళ్లంరాజు మరోసారి కాకినాడ లోకసభ స్థానానికి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఇక్కడి నుంచి మూడుసార్లు విజయం సాధించారు. పనబాక లక్ష్మి మరోసారి ఎస్సీలకు రిజర్వ్ చేసిన బాపట్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
సీమాంధ్రలో 3.67 కోట్లకు పైగా ఓటర్లు 175 శాసనసభా స్థానాలకు, 25 లోకసభ స్థానాలకు తమ ప్రతినిధులను ఎన్నుకోనున్నారు.