గోల్కొండ కోటలా ఏపీలో కొండపల్లి కోట: చంద్రబాబు ప్లాన్
అమరావతి: తెలంగాణలోని హైదరాబాద్లో గల గోల్కోండ కోట తరహాలో విజయవాడ సమీపంలోని కొండపల్లి కోటను అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఈ దిశగా కొండపల్లి కోట వైభవాన్ని తెలియచెప్పి, పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ప్రణాళికలు రూపొందించాలని టూరిజం విభాగానికి ఆదేశాలు అందాయని తెలుస్తోంది.
కొండపల్లి కోటను రెడ్డి రాజుల కాలంలో నిర్మించారు. అయితే పాలకుల ఆదరణకు నోచుకోక మరుగున పడింది. ఏపీ విడిపోయిన అనంతరం రాజధానికి అమరావతి సమీపంలోనే ఈ కోట ఉంది. ఈ కోట చరిత్రను అందరికీ పరిచయం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

ఈ కోటను అబివృద్ధి చేసేందుకు రూ.10 కోట్లు కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది. కోటకు సంబంధించిన విలువైన ఆధారాలు, శిల్పాలు ప్రస్తుతం హైదరాబాదులోని స్టేట్ మ్యూజియంలో ఉన్నాయి. వాటిని ఏపీకి తీసుకురావాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అభివృద్ధి పనుల్లో భాగంగా కొండపల్లి గ్రామం నుంచి కోట వరకూ రోప్ వే, ఫుడ్ కోర్టులు తదితరాలు నిర్మించనున్నారు. ఇప్పటికే కేంద్రం ప్రకటించిన మెగా టూరిజం సర్క్యూట్లో కొండపల్లికి స్థానం లభించింది.కొండపల్లి - ఇబ్రహీంపట్నం - భవానీ ద్వీపం - మచిలీపట్నం - దివిసీమ ప్రాంతాలను భాగం చేస్తూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications