వివేకా కుమార్తె రిక్వెస్ట్-సరేనన్న చంద్రబాబు..!
ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఆయన కుమార్తె సునీతారెడ్డిని గత వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ ఎస్పీ రాంసింగ్, సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. దీనిపై ఇవాళ సునీతారెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ చురుగ్గా దర్యాప్తు చేస్తున్న సమయంలో ప్రభుత్వ పెద్దలు దీన్ని పక్కదోవ పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఇదే క్రమంలో వివేకా పీఏ కృష్ణారెడ్డితో సీబీఐ ఎస్పీ రాంసింగ్ తో పాటు సునీతారెడ్డి దంపతులపై కేసు పెట్టించారు. దీనిపై వీరు కోర్టుల్లో ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. అయినా పోలీసులు నమోదు చేసిన కేసు కావడంతో దీన్ని తిరిగి ప్రభుత్వమే వెనక్కి తీసుకోవాల్సిన పరిస్ధితి.
దీంతో ఇవాళ వివేకా కుమార్తె సునీతారెడ్డి తన భర్త రాజశేఖర్ రెడ్డితో కలిసి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. వివేకా హత్య, అనంతర పరిస్ధితులు, దర్యాప్తు, తమపై పోలీసులు పెట్టిన కేసు గురించి ఆయనకు వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు తనకు అన్ని వివరాలూ తెలుసన్నారు. పోలీసులు సునీతారెడ్డి దంపతులుపై పెట్టిన కేసు వివరాలు తెప్పించుకుని ఆమెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పంపారు. దీంతో సునీతారెడ్డికి ఊరట దక్కినట్లయింది.












Click it and Unblock the Notifications