పైసలొచ్చే ఫైళ్లపైనే కిరణ్: చంద్రబాబు, సోనియాపైనా ఫైర్
హైదరాబాద్: కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అవినీతి, కుంభకోణాలకు పాల్పడుతోందని, వచ్చే ఎన్నికల్లో దేశంలోని విద్యావంతులెవరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అనుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మేధోమథన సదస్సులో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని అన్నారు. కాంగ్రెస్ వల్ల దేశానికి భవిష్యత్ ఉండదని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.
మార్చి మొదటివారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓట్లు, సీట్ల కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం విభజిస్తోందని ఆయన విమర్శించారు. దేశంలో జరుగుతున్న పలు కుంభకోణాల్లో ప్రధాని కార్యాలయంలో పాత్ర కూడా ఉందని ఆరోపించారు. బొగ్గు కుంభకోణంలో ఇండియా టుడే ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బాగా దెబ్బతింటోందని తేలిందని ఆయన చెప్పారు.
బొగ్గు కుంభకోణంలో ప్రధాన నిందితుడైన ప్రధాని మన్మోహన్ సింగ్పై కూడా కేసు నమోదు చేయాలని బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పిసి పరేఖ్ పేరును సిబిఐ తన ఛార్జీషీటులో నమోదు చేసిన నేపథ్యంలో పరేఖ్ ఈ వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనంతో రూపాయి విలువ క్షీణిస్తోందని, ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎఫ్డిఐలను ఆహ్వానించినా రూపాయి విలువ పెరగలేదని అన్నారు. భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వస్తువుల ధరలు పెరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి చర్యలేవి చేపట్టడం లేదని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో కొత్త ప్రాజెక్టులు కూడా రావడం లేదని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ 1999కంటే ముందున్న రేటుకు పడిపోయిందని తెలిపారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతోందని పేర్కొన్నారు. చదువుకున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరని ఆయన అన్నారు. అయితే చదువుకోని గ్రామాల్లోని ప్రజలను చైతన్యం చేసి కాంగ్రెస్ మోసాల నుంచి కాపాడాలని తమ పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అవినీతి, కుంభకోణాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుత అనిశ్చితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైసలు వచ్చే ఫైళ్లపైనే సంతకాలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.