'మై బ్రిక్ మై అమరావతి' ప్రారంభం, 108 ఇటుకలు కొన్న సింగపూర్వాసి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు మై బ్రిక్ - మై అమరావతి వెబ్సైట్ను ప్రారంభించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో పాలు పంచుకోవాలనుకునే వారు ఈ వెబ్ సైట్ ద్వారా ఇటుకలను కొనుగోలు చేయవచ్చు.
ఈ వెబ్ సైట్ను ప్రారంభించగానే సింగపూర్లో ఉంటున్న ప్రవాసాంధ్రుడు ఒకరు 108 ఇటుకలను ఈ సైట్ ద్వారా కొనుగోలు చేశారు. మై బ్రిక్ మై అమరావతి సైట్లో ఒక్కో ఇటుక ధరను రూ.10గా నిర్ణయించారు. ఇందులో రాజధాని అమరావతికి విరాళాలు కూడా ఇవ్వవచ్చు.
Webiste: http://amaravati.gov.in/

రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లపై చంద్రబాబు సమీక్ష
అంతకుముందు చంద్రబాబు.. ఉదయం అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... స్వాతంత్ర సరమయోధుల ఇళ్ల నుంచి మట్టిని సేకరించాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణం మన అందరి బాధ్యత అని స్పష్టం చేశారు.
అమరావతి శంకుస్థాపనకు తిరుమల నుంచి మట్టి - నీరు తీసుకు రావాలని సీఎం చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాస రాజును ఆదేశించారు. ఈ మేరకు.. టిటిడి అర్చక బృందం మట్టి - నీటిని తీసుకు వెళ్లనుంది.
అమరావతి నిర్మాణానికి కేంద్ర పర్యావరణశాఖ అనుమతి
రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోద పత్రాన్ని పంపిందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రమే కేంద్ర పర్యావరణశాఖ అనుమతి పత్రం జారీ చేసిందన్నారు.
ఏపీ నూతన రాజధాని నిర్మాణానికి ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు హాజరుకానున్నారు.












Click it and Unblock the Notifications