డీజీపీ గారూ... 4జతల ఖాకీదుస్తులు వారికి పంపండి; పుంగనూరు ఘటనపై చంద్రబాబు, లోకేష్!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న దాడి ఘటనలతో వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు లో పారిశ్రామికవేత్త జనసేన నాయకుడు రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం పై అటు జనసేన తో పాటు ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత ఎన్నికల్లో జనసేన తరపున చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి పోటీ చేసిన పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ రైతుల సమస్యలపై సదుంలో తలపెట్టిన రైతుభేరికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఇది వైసీపీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సభ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్నరాత్రి వైసిపి కార్యకర్తలు రామచంద్ర యాదవ్ ఇంటికి వెళ్లి విధ్వంసం సృష్టించారు. కర్రలు, రాళ్లతో దాడి చేసి ఇంట్లో ఉన్న ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. కార్లను ధ్వంసం చేశారు.
తలుపులు, కిటికీలు విరగ్గొట్టారు. దీంతో ప్రాణభయంతో రామచంద్ర యాదవ్ ఓ గదిలో దాక్కొని ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ ఘటన పై జనసేన నాయకులు తీవ్రస్థాయిలో వైసిపి సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే, టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
ఇది నాటి రోజుల్లో బీహార్ కాదు...నేటి రోజుల్లో పుంగనూరు! డీజీపీ గారూ... నాలుగు జతల ఖాకీ దుస్తులు మీ స్థానిక అధికారులకు పంపండి. లేకపోతే రాష్ట్రంలో మొత్తం పోలీసు శాఖను మూసేశారు అనుకుంటారు.@APPOLICE100
— N Chandrababu Naidu (@ncbn) December 5, 2022
#YSRCPRowdyism #YCPGoondas pic.twitter.com/VlyeXQeCA3
పుంగనూరులో వైసిపి కార్యకర్తలు దాడికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన చంద్రబాబు ఇది నాటి రోజుల్లో బీహార్ కాదు...నేటి రోజుల్లో పుంగనూరు! అని పేర్కొన్నారు. డీజీపీ గారూ... నాలుగు జతల ఖాకీ దుస్తులు మీ స్థానిక అధికారులకు పంపండి. లేకపోతే రాష్ట్రంలో మొత్తం పోలీసు శాఖను మూసేశారు అనుకుంటారు అంటూ పోలీసులు తమ విధులను నిర్వర్తించడం లేదని, అందుకే వారికి ఖాకీ దుస్తులు పంపించాలని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ ఘటనపై మండిపడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ జయహో బీసీ సభ నిర్వహిస్తుంటే, ఇటు పుంగనూరులో ముఖ్యమంత్రి తరువాత నెంబర్ 2 స్థానంలో వున్న మంత్రి పెద్దిరెడ్డి బీసీ నేతలని అంతమొందించే కుతంత్రాలు చేస్తున్నారు అంటూ విరుచుకుపడ్డారు. బీసీ అయిన పుంగనూరు జనసేన నాయకుడు రామచంద్రయాదవ్ ఇంటిపై వైసీపీ మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు.
సీఎం జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ జయహో బీసీ సభ నిర్వహిస్తుంటే, ఇటు పుంగనూరులో ముఖ్యమంత్రి తరువాత నెంబర్ 2 స్థానంలో వున్న మంత్రి పెద్దిరెడ్డి గారు బీసీ నేతలని అంతమొందించే కుతంత్రాలు చేస్తున్నారు.(1/3)#YSRCPRowdyism #YCPGoondas pic.twitter.com/pCzMCrLCCA
— Lokesh Nara (@naralokesh) December 5, 2022
రామచంద్రయాదవ్ బీసీ కావడమే నేరమా? రైతు సదస్సు నిర్వహించాలనుకోవడం ద్రోహమా? అంటూ ప్రశ్నించిన నారా లోకేష్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .. ప్రశ్నించే వాళ్ల ప్రాణాలు తీయడమేనా మీకు తెలిసిన ప్రజాస్వామ్యం అంటూ నిలదీశారు. ఒక బీసీ నేతని అంతమొందించే లక్ష్యంతో మంత్రి పెద్దిరెడ్డి మనుషులే దాడికి దిగితే, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణం అంటూ లోకేష్, ఇదంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన కుట్ర అని అభివర్ణించారు.