జగన్ను వంద మీటర్ల లోతుకు పంపితే సరి: చంద్రబాబు వ్యాఖ్య
ఏలూరు: పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుకు 100 మీటర్ల లోతులో ఉండే డయాఫ్రమ్వాల్ కనిపించడం లేదంటూ ఇటీవల ఒక పెద్ద మనిషి ప్రకటన చేశాడని ఆయన జగన్ను ఉద్దేశించి సీఎం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్వాల్ 100 మీటర్లలోతున కడుతున్నారని, ఈ వాల్ ఎలా ఉంటుందో చూపించాలంటే ఆయనను 100 మీటర్ల లోతుకు పంపితే సరిపోతుందని చంద్రబాబు అన్నారు.
చూసొచ్చిన తర్వాతనైనా
చూసొచ్చిన తర్వాతైనా వాల్ ఉందని నమ్ముతాడని చంద్రబాబు జగన్కు చురకలు వేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్న తనకే కొన్ని పనులు కొత్తగా ఉన్నాయని, అలాంటిది ఈ ప్రాజెక్టుపై ఏమాత్రం అవగాహన లేని జగన్ అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారని అన్నారు.
జగన్కు ఏమైనా తెలుసా...
డయాఫ్రమ్వాల్ అంటే ఏమిటో? పిల్లర్ అంటే ఏమిటో.. స్పిల్ వే, స్పిల్ చానల్ అంటే ఏమిటో జగన్కు తెలుసా? అని చంద్రబాబు ప్రశ్నించారు.. ఇలాంటి నాయకులు రాజకీయాల్లోకి వచ్చారని ఆయన మండిపడ్డారు.
దానికేమైనా బంగారు పూత ఉంటుందా...
పోలవరం ప్రాజెక్టు వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలన్న జగన్ డిమాండ్పై చంద్రబాబు వ్యంగ్యంగా ప్రతిస్పందించారు. అసెంబ్లీలోనూ సమీక్ష సమావేశాలు జరిగిన ప్రతిసారీ ప్రాజెక్టు వ్యయాలపై వాస్తవ పత్రాలను విడుదల చేస్తున్నామని, ఇంతకన్నా ఇంకేం వివరాలు కావాలని ప్రశ్నించారు. అవన్నీ శ్వేతపత్రాలు కావా, శ్వేతపత్రం అంటే దానికేమైనా బంగారు పూత ఉంటుందా అని చంద్రబాబు అన్నారు.
తెరపైకి కొత్త ప్రతిపాదన
పోలవరం పనుల్లో వేగం తగ్గకుండా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త ప్రతిపాదనను తెర మీదికి తెచ్చింది. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ మరికొన్ని కాంట్రాక్టు సంస్థలతో కలిసి ఓ కన్సార్షియంగా ఏర్పడాలని భావిస్తోందని, ఆ కన్సార్షియానికి పూర్తిస్థాయిలో పనులు అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబు చెప్పారు.