విభేదాలకు చెక్: రాజధానిపై చంద్రబాబు నేడు ప్రకటన?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడనే విషయంపై తీవ్రమైన గందరగోళం ఏర్పడడమే కాకుండా మంత్రుల మధ్య విభేదాలు కూడా ఏర్పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు మంగళవారం శాసనసభలో ప్రకటన చేసే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎపి రాజధాని అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. భూసేకరణకు ఇబ్బంది లేకపోతే మంగళగిరి వద్ద, ఇబ్బందులుంటే నూజివీడు వద్ద రాజధానిని ఏర్పాటు చేద్దామని చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద, విజయవాడ సమీపంలోనే రాజధానిని ఏర్పాటు చేసుకోవాలనే కృతనిశ్చయంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. భూసేకరణ, తదితర విషయాలను పరిశీలించడానికి మంత్రులు నారాయణ, యనమల రామృష్ణుడులతో పాటు కృష్ణా, గుంటూరు శాసనసభ్యులతో ఓ కమిటీని వేశారు. రాజధాని విషయంలో రేపు కచ్చితమైన ప్రకటన చేయడానికి సిద్ధపడిన చంద్రబాబు శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున మంత్రివర్గ సమావేశం వివరాలను బయట చెప్పకూడదని మంత్రులను ఆదేశించారు.
రాజధానిపై ఏర్పడిన రాష్ట్ర మంత్రుల సలహా కమిటీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న నారాయణపై ఇటీవల రాయలసీమకు చెందిన ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు అవుతుందని నారాయణ పదే పదే ప్రకటన చేస్తూ అనుచిత చర్యలకు పాల్పడుతున్నరని, నారాయణ ప్రకటనల వల్ల ఆ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆయన అన్నారు.

విజయవాడను తాత్కాలిక రాజధానిగా చేసుకోవాలనే చంద్రబాబు ఆలోచనపై కూడా కొంత వ్యతిరేకత ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. కోస్తాంధ్ర మంత్రులు, నాయకుల అభిప్రాయం రాజధాని విషయంలో ఒక రకంగా ఉండగా, రాయలసీమ మంత్రులు, తెలుగుదేశం నాయకుల అభిమతం మరో రకంగా ఉంది. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటును సమర్థిస్తున్నట్లు కనిపిస్తూనే మంత్రి పరిటాల సునీత రాయలసీమలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని అన్నారు. టిడిపి పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు కూడా రాజధానిపై సంచలన ప్రకటన చేశారు.
మరోవైపు, శివరామకృష్ణన్ కమిటీ చంద్రబాబు ఆలోచనతో విభేదించినట్లు, పాలన వికేంద్రీకరణ జరగాలని, విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు సరి కాదని, అది నష్టం చేస్తుందని శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో అభిప్రాయపడినట్లు వార్తాకథనాలు వచ్చాయి. ఈ వార్తాకథనాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాపై తన సహజశైలికి భిన్నంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశం రాజధాని విషయంలో గందరగోళానికి అంతం పలకాలని అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ఎపి రాజధాని విషయంలో వస్తున్న అసత్య వార్తాకథనాలకు కూడా సమాధానం చెప్పాలని అభిప్రాయపడినట్లు సమాచారం. ఇదే సమయంలో రాజధాని విషయంలో తుది నిర్ణయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ మంత్రులు అంటున్నారు. శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పినా అది చెల్లుబాటు కాదనే పద్ధతిలో వారు మాట్లాడుతున్నారు. ఈ స్థితిలో రేపు శాసనసభలో ఎపి రాజధాని విషయంపై చంద్రబాబు ప్రకటన చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications