బాబు మానసిక స్థితి దిగజారింది.. జగన్ ను తిట్టడమే ఆయన పని : భూమన
హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామిలను నెరవేర్చలేక జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్న సీఎం చంద్రబాబు ఆఖరికి పవిత్ర పుష్కరాలను కూడా జగన్ ను తిట్టడానికే వాడుకోవడం శోచనీయమన్నారు భూమన. ఆదివారం నాడు పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఇకపోతే ప్రముఖ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్ విషయంలోను చంద్రబాబు విపరీత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారని భూమన అసహనం వ్యక్తం చేశారు. అమరావతి రైతుల విషయంలో ప్రభుత్వ ఆగడాలపై కోర్టు మెట్లెక్కిన ఆయన వెనుక.. జగన్ ఉన్నారని చంద్రబాబు ఆరోపించడం దురహంకార చర్య అని విమర్శించారు భూమన.
చంద్రబాబు మానసికి స్థితి దిగజారిందనేది ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని.. లేకపోతే తెలుగునాట ప్రముఖ పత్రికలన్నింటికీ సంపాదకత్వం వహించిన ఏబీకే ప్రసాద్ ను ఉద్దేశించి బాబు అలాంటి వ్యాఖ్యలు చేసుండేవారు కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబును మతిస్థిమితం లేని వ్యక్తిగా అభివర్ణించారాయన.
ప్రజా ఉద్యమాలను లాఠీలతో అణిచేయడం.. అమరావతి రైతులకు జరుగుతోన్న అన్యాయాలను అసెంబ్లీలో లేవనెత్తితే ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూడడం దారుణం అన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు భూమన. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించకపోతే.. రౌడీలు, గూండాల వద్దకు వెళ్లాలా అని చంద్రబాబును ప్రశ్నించారు.
ఏపీలోని అన్ని వ్యవస్థలను చంద్రబాబు ప్రభావితం చేస్తుంటే.. బాధితుల తరుపున న్యాయపోరాటం చేయడమే మీ దృష్టిలో తప్పా? అని భూమన నిలదీశారు. చంద్రబాబు చెబుతున్నట్లు.. ఏబీకే ప్రసాద్ కు సుప్రీం అక్షింతలేమి వేయలేదని.. బాధితులే కోర్టును ఆశ్రయిస్తే విచారణ జరుపుతామని సుప్రీం వెల్లడించినట్లుగా తెలిపారు భూమన.