ఫలించిన బాబు విందు రాజకీయం: రాజధాని ఉద్యోగులకు ప్రత్యేక రైలు, ‘హోదా హుళక్కే’
హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించిన విందు రాజకీయాలు ఫలిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అవసరమైన పలు ప్రయోజనాలను రాబట్టుకునేందుకు ఇటీవల విజయవాడకు వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు విందు ఇచ్చిన చంద్రబాబు.. రాష్ట్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ క్రమంలో నిర్దేశిత గడువు (జూన్ 27)లోగా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలో శరవేగంగా నిర్మాణం జరుగుతున్న తాత్కాలిక రాజధానికి ఉద్యోగులు తరలివచ్చేందుకు అయిష్టత చూపుతున్న విషయం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
వారానికి ఐదు రోజుల పనిదినాలను అమల్లోకి తెస్తున్నామన్న చంద్రబాబు.. హైదరాబాదులోని కుటుంబాల వద్దకు ఉద్యోగులు వెళ్లి వచ్చేలా ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని ప్రభును కోరారు. ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పిన ప్రభు సికింద్రాబాద్- విజయవాడల మధ్య ఓ ప్రత్యేక రైలును నడిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ రైలు సికింద్రాబాదు- విజయవాడల మధ్య పట్టాలెక్కనుంది. వారానికి మూడు రోజుల పాటు తిరగనున్న ఈ రైలు... సికింద్రాబాద్ నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరి ఉదయానికి విజయవాడ చేరుతుంది. అదే సమయంలో విజయవాడలోనూ రాత్రి 10 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయానికే సికింద్రాబాదు చేరుతుందట. ఇప్పటికే ఈ రైలుకు అవసరమైన కోచ్లను కూడా సిద్ధం చేసిన రైల్వే శాఖ.. మరో పది రోజుల్లో ఈ రైలును పట్టాలెక్కించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
హోదాపై తేల్చేసిన కేంద్రమంత్రి
ఏపీకి ప్రత్యేక హోదా దక్కే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదు. ఇప్పటికే కేంద్రం పలుమార్లు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. తాజాగా వికాస్ పర్వ్ పేరిట నిర్వహిస్తున్న సభలో పాలుపంచుకునేందుకు బుధవారం నెల్లూరు వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఈ విషయాన్ని మరోమారు తేల్చిచెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం దాదాపుగా సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అయినా ప్రత్యేక హోదా కింద రాష్ట్రానికి అందే సాయం కంటే అధికంగానే నిధులు కేటాయిస్తున్నట్లు పారికర్ పేర్కొన్నారు.