బాబుకు 'టి' భావన కలగనట్లుంది, డిక్షనరీలోనే..:కోదండ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ శుక్రవారం మండిపడ్డారు. తమ డిక్షనరీలో రెచ్చగొట్టడం అనేది లేదని చెప్పారు. చంద్రబాబు డిక్షనరీలో ఆ ఒక్క పదం మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే భావన చంద్రబాబుకు ఇంకా కలగనట్టుందన్నారు. తెలంగాణలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అనడం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అగౌరవపరచడమేనన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను చంద్రబాబు ఇంకా గుర్తించనట్లుగా ఉందన్నారు.
కెసిఆర్ ప్రభుత్వ ఏర్పాటులో బిజీగా ఉండడం వల్లే తమతో కలువలేకపోయామని చెప్పిన విషయం తెలిసిందే. దీన్ని రాద్దాంతం చేయవద్దన్నారు. కెసిఆర్ తమవాడని, ఆయన్ను ఎప్పుడైనా కలుస్తామన్నారు. ఉద్యోగుల పంపిణీలో తెలంగాణ వారికి అన్యాయం జరగకూడదని చెప్పారు.
ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతాల్లోనే ఉండాలన్నారు. తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేకూరేంతవరకు తెలంగాణ జెఏసి పోరాడుతుందన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత విఠల్ను సీమాంధ్ర ఉద్యోగిగా పంపడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. విఠల్ అంశంపై సిఎస్ వెంటనే స్పందించాలని కోరారు. ఉద్యోగులు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా జెండా ర్యాలీలు, ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు.
మన ఉద్యోగులే: కవిత
మన సచివాలయంలో మన ఉద్యోగులే ఉండాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వేరుగా అన్నారు.