కాంగ్రెస్తో దోస్తీ, జగన్ను దెబ్బతీసేందుకు బాబు వ్యూహం!: పవన్కు ప్లస్, జనసేనతో టచ్లో కీలక నేతలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో గెలవడానికి, దళితుల ఓట్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాబట్టుకోవడానికి భారీ వ్యూహం రచించారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో జత కట్టడానికి దళితుల ఓట్లు చీల్చి, జగన్ను నష్టపరిచే ప్లాన్ కూడా ఒకటి అంటున్నారు.
పెనుమార్పులకు సంకేతం: ములాయం, 'చంద్రబాబు దెబ్బకు ఆందోళనలో మోడీ'
కాంగ్రెస్ పార్టీతో పొత్తు కారణంగా టీడీపీకి లాభం, నష్టం ఎంత, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎలా ప్రయోజనం చేకూరుతుందనే అంశంపై టీడీపీ, కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రెండు పార్టీలు కలవలేదు. కానీ టీడీపీ చరిత్రలో తొలిసారి కాంగ్రెస్తో కలవడంపై చంద్రబాబుపై చాలామంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కలిసి వెళ్లాల్సిందే
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో వెళ్లడమే మంచిదని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓ వైపు ప్రజా వ్యతిరేకత, మరోవైపు జగన్కు వస్తున్న ఆదరణ, ఇంకో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో కీలకంగా మారడం టీడీపీకి నష్టం చేస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో జతకలిస్తే రాజకీయంగా ఎంతోకొంత టీడీపీకి లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారట. అలాగే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కువగా లాభపడనుంది.
విభజన తర్వాత వైసీపీకి మారిన ఓటు బ్యాంకు
పాదయాత్ర, జనసేన పోరాట యాత్రల ద్వారా వైయస్ జగన్, పవన్ కళ్యాణ్లు దూసుకెళ్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుతో పాటు వారు కూడా సందర్భం వచ్చినప్పుడు నిలదీస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే, విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీకి దళితుల ఓటు బ్యాంకు ఉంది. విభజన తర్వాత కొంత ఓటు బ్యాంకు వైసీపీకి మరలింది.
జగన్ను దెబ్బతీయవచ్చునని
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఆ వర్గం నుంచి వైసీపీకి ఉన్నంత అండ లేదు. కానీ కాంగ్రెస్కు ఎంతోకొంత ఉంది. హోదా కోసమే అంటూ కాంగ్రెస్ పార్టీతో కలిస్తే ప్రజలు పునరాలోచన చేస్తారని, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు తమకు వస్తుందని తెలుగుదేశం పార్టీకి లాభిస్తుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారట. దీంతో దళిత ఓటు బ్యాంకు ఉన్న జగన్ను బాగా దెబ్బతీయవచ్చునని భావిస్తున్నారట. కాంగ్రెస్, టీడీపీల పొత్తుతో ఇరు పార్టీలకు లాభం జరుగుతుందని, అలాగే టీడీపీ గెలుపు నల్లేరు మీద నడక వంటిదేనని, అలాగే, విభజన ద్వారా కాంగ్రెస్ ఏపీలో దెబ్బతిన్నదని, తమతో కలిస్తే ఆ పార్టీకి కూడా లాభం అవుతుందని టీడీపీ నేత కారెం శివాజీ అన్నారట.
ఓట్లు చీలిపోతాయి
ప్రస్తుతం దళితులు ఎవరికి మద్దతివ్వాలా అనే డైలమాలో ఉన్నారని కారెం శివాజీ చెబుతున్నారు. జగన్కు మద్దతిచ్చే అంశంపై పునరాలోచనలో ఉన్నారని, మధ్యలో పవన్ కళ్యాణ్ రంగంలోకి రావడంతో జగన్ అధికారంలోకి వస్తారా అనే ఆలోచనలో ఉన్నారని, అలాంటప్పుడు అధికారంలోకి రాని వైసీపీకి మద్దతివ్వాలా వద్దా అని యోచిస్తున్నారని, ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ పొత్తు ద్వారా అధికారంలోకి వస్తామనే విశ్వాసం కలిగించవచ్చునని చెబుతున్నారట. అప్పుడు దళితుల ఓట్లు కాంగ్రెస్, వైసీపీల మధ్య చీలుతాయని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, బీజేపీతో కలిసి వెళ్తున్నారనే అనుమానాలు ఉన్నందున జగన్కు మద్దతిచ్చే విషయంలో పునరాలోచన చేస్తారని అంటున్నారు.
జనసేనకు బూస్ట్
ఇదిలా ఉండగా, టీడీపీ, కాంగ్రెస్ పొత్తు జనసేనకు బూస్ట్ను ఇస్తోందని అంటున్నారు. వారి కలయిక వల్ల జనసేనకు లబ్ధి చేకూరుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని పవన్ కళ్యాణ్ పదేపదే విమర్శిస్తున్నారు. ముప్పై అయిదేళ్ల క్రితం ఎన్టీఆర్ అందుకున్న తెలుగు వారి ఆత్మగౌరవాన్ని జనసేన ఇప్పుడు మళ్లీ ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని భావిస్తోంది.
కాంగ్రెస్, టీడీపీలకు షాక్, జనసేనతో చర్చలు
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పొత్తు నేపథ్యంలో జనసేనకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్న పలువురు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఇథర జిల్లాల నాయకులు జనసేన నాయకులతో టచ్లో ఉన్నారట. వారితో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. టీడీపీ, కాంగ్రెస్ పొత్తుతో తమ రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందని భావిస్తున్న పలువురు జనసేన వైపు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు చర్చలు జరుగుతున్నాయ. యువత, మహిళలు పవన్కు అండగా ఉంటారని ధీమాగా ఉన్నారు.