వీసా గాడ్ పై అమెరికా విషం! దేవుడినే మాఫియా అంటూ..
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల టాలెంట్, కష్టపడే తత్వాన్ని చూసి ఓ సెనేటర్ అక్కసు వెళ్లగక్కారు. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను భారతీయులు తక్కువ వేతనాలకే కొల్లగొడుతున్నారని, దీని వెనుక ఒక పెద్ద 'వీసా కార్టెల్' (వీసాల మాఫియా) నడుస్తోందని మిస్సౌరీ సెనేటర్ ఎరిక్ ష్మిట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా మారాయి.
భక్తుల పాలిట కొంగుబంగారంగా, 'వీసా గాడ్'గా నీరాజనాలు అందుకునే చిలుకూరు బాలాజీ ఆలయ చిత్రాన్ని ఎరిక్ ష్మిట్ తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్ట్ చేశారు. "ఈ వీసా కార్టెల్కు ఒక దేవాలయం ఉంది. వేలాది మంది ఈ ఆలయం చుట్టూ తిరుగుతూ, అమెరికా వర్క్ వీసాలు రావాలని పాస్పోర్టులకు ఆశీర్వాదాలు తీసుకుంటుంటారు" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చిలుకూరు బాలాజీకి ఉన్న ఆధ్యాత్మిక విశిష్టతను తక్కువ చేస్తూ, దీన్ని వీసా మాఫియా కేంద్రంగా ఆయన చిత్రించడంపై ప్రవాస భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
The "Visa Cartel" has its own “Visa Temple” in Hyderabad, which sees thousands of Indians circling altars and getting passports blessed for U.S. work visas.
— Senator Eric Schmitt (@SenEricSchmitt) May 13, 2026
American workers shouldn’t have to compete against a system this gamed. pic.twitter.com/k7wSlECTJ6

భారతీయ విద్యార్థులు, టెక్ నిపుణులపై విమర్శలు
అమెరికాలోని ఉపాధి ఆధారిత వీసా వ్యవస్థ (H-1B, L1, F1, OPT) అమెరికన్లను నిర్వీర్యం చేస్తోందని ష్మిట్ ఆరోపించారు. విదేశీ విద్యార్థుల్లో సగం మంది భారతీయులేనని, వారు అమెరికా పన్ను చెల్లింపుదారుల నిధులతో రాయితీలు పొందుతూ, చదువు పూర్తయ్యాక హెచ్-1బీ ద్వారా గ్రీన్కార్డులు సాధిస్తున్నారని మండిపడ్డారు. తక్కువ వేతనాలతో పనిచేసే భారతీయుల వల్ల అప్పులతో సతమతమయ్యే అమెరికన్ గ్రాడ్యుయేట్లు నష్టపోతున్నారని ఆయన వాపోయారు. అంతేకాకుండా, పెద్ద టెక్ కంపెనీలు ప్రతిభ కంటే జాతి పక్షపాతానికే పెద్దపీట వేస్తున్నాయని, భారతీయులు ఇంటర్వ్యూ ప్రశ్నలను రహస్యంగా పంచుకుంటూ ఉద్యోగాలు సాధిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ఏఐ నిధులను కూడా వదలని సెనేటర్!
ప్రస్తుతం కృత్రిమ మేధ (AI) శిక్షణ కోసం అమెరికా ఇస్తున్న బిలియన్ల డాలర్ల సబ్సిడీలు భారత్కు తరలిపోతున్నాయని ష్మిట్ విమర్శించారు. అమెరికా సంపద భారత్కు మళ్లుతోందని, ఇది స్థానిక వేతన వ్యవస్థలను ఒత్తిడికి గురిచేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారతీయుల కీలక పాత్రను విస్మరించి, కేవలం జాతి వివక్షతోనే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భక్తుల ఆగ్రహం.. ఆధ్యాత్మిక కేంద్రంపై దాడి!
ఏ ఎటువంటి హుండీ లేకుండా, కేవలం భక్తితో 11 ప్రదక్షిణలు చేసే భక్తుల నమ్మకాన్ని 'వీసా కార్టెల్'గా అభివర్ణించడంపై చిలుకూరు బాలాజీ భక్తులు మండిపడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉండి మరో దేశంలోని ఆధ్యాత్మిక సంప్రదాయాలను కించపరచడం సరికాదని హితవు పలుకుతున్నారు. భారతీయుల నైపుణ్యాన్ని స్వీకరించలేక, ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం అమెరికాలోని 'ఇన్వెస్ట్ ఇన్ అమెరికా' వంటి నినాదాలకే గొడ్డలిపెట్టు అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.














Click it and Unblock the Notifications