కేంద్రంలో పరిణామాలు మారుతున్నాయి, అన్నింటికి సిద్ద పడండి: చంద్రబాబు మాటల పరమార్ధం..!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటనల పై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. కేసిఆర్ ఏపి కి రావటం సంతోషమే నంటూ.. గందరగోళం..అయోమయం సృష్టించేందుకే కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని బాబు ఆరోపించారు. ఇక, రానున్న ఆరు నెలల పాటు పార్టీలో ఎమెర్జెన్సీ విధిస్తున్నామని..ప్రతీ ఒక్కరూ ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు. అదే సమయంలో కేంద్రంలో పరిణామాలు వేగంగా మారుతాయని చెబుతూ...నేతలు అన్నింటికి సిద్ద పడి ఉండాలని సూచించారు. ఈ సూచన ఇప్పుడు పార్టీలో చర్చకు కారణమైంది...
జాతీయ రాజకీయాల పై
టిడిపి సమన్వయకమిటీ సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో పరమార్ధం ఏంటనే చర్చ ఇప్పుడు మొదలైంది. జాతీయ రాజకీయాల పై ఆయన వ్యాఖ్యలు ఆసక్తికి కారణమవుతున్నాయి. కేంద్రంలో ఉన్న బిజెపి ఏపికి సహాయ నిరాకరణ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ తో కలవటం తప్పేంటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఎన్నిక లకు ముందు అక్కడ ఒక పార్టీకే అనుకూలంగా ఉందని..మహాకూటమి ఏర్పాటు పోటీ తరువాత హోరా హోరీ వాతా వరనం ఏర్పడిందని విశ్లేషించారు. అదే సమయంలో కేసిఆర్ ఏపికి రావటం మంచిదేనని సీయం వ్యాఖ్యానించారు. కానీ, కేసిఆర్ గందరగోళం సృష్టించేందుకే పర్యటిస్తున్నారు దుయ్యబట్టారు.
ఏపికి ప్రధాని మోదీ...అన్నింటికీ సిద్దంగా ఉండండి..
ఇదే సమావేశంలో ముఖ్యమంత్రి పార్టీ నేతలకు కీలక సూచనలు చేసారు. ప్రధాని మోదీ ఏపీకి రాబోతున్నారని... కేంద్రంలో కూడా ఇంకా చాలా పరిణామాలు జరగబోతున్నాయని వివరించారు. పార్టీ నేతలు అన్నింటికీ సిద్దంగా ఉండాలని నేతలకు సూచించారు. దీని ద్వారా చంద్రబాబు ఉద్దేశం ఏంటనే చర్చ మంత్రుల్లో మొదలైంది. కేంద్రం తమను వేధిస్తుందని..ప్రజలే అండగా ఉండాలని గతంలో చంద్రబాబు పిలుపునిచ్చారు. కొంత కాలంగా పార్టీ నేతల పై ఐటి, ఇడి దాడులు జరుగుతున్నాయి.
పొలిటికల్ ఎమెర్జెన్సీ
వీటిని దృష్టిలో ఉంచుకొని ..భవిష్యత్ పరిణామాలు అంచనాలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని మంత్రులు విశ్లేషిస్తున్నారు. పార్టీలో పొలిటికల్ ఎమెర్జెన్సీ విధిస్తున్నామని చెప్పారు. తన తో సహా పార్టీలో ప్రతీ ఒక్కరూ ప్రజలతోనే ఉండాలని ఆదేశించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై జిల్లాల వారిగా నేతలను బాబు ప్రశ్నించారు. నేతలు చేసే తప్పులతో పార్టీ పరువుపోతుందని చంద్రబాబు అన్నారు.