ఎన్నికలొచ్చేస్తున్నాయి...తమ్ముళ్లూ! బీ రెడీ అంటున్న చంద్రబాబు:వరుస మీటింగ్ లతో అలెర్ట్
అమరావతి:ఎలక్షన్ మేనేజ్ మెంట్ లో మిగిలిన నేతలతో పోలీస్తే చంద్రబాబు స్టైలే వేరు. సొంత పార్టీ నేతలను సమాయత్తం చేయడంతో అనూహ్య వ్యూహాలతో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టడంలో చంద్రబాబుది అందెవేసిన చేయి.
ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలు సంవత్సరాల గడువు నుంచి నెలల వ్యవధిలోకి వచ్చేయడంతో చంద్రబాబు ఎన్నికల మేనేజ్ మెంట్ ప్రక్రియను మిగతా పార్టీల నేతలకంటే ముదుగానే ప్రారంబించినట్లు కనిపిస్తోంది. ఎపి సిఎంగా ఒక వైపు ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు టిడిపి అధినేతగా వరుస పార్టీ మీటింగ్ లతో తెలుగు తమ్ముళ్లను అప్రమప్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయభేరి ఎలా మోగించాలో వారికి మెలకువలు నూరిపోస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
మళ్లీ...ఘన విజయం సాధించాలి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ మనం ఘన విజయం సాధించాలి! అలాగే మొత్తం 25 ఎంపీ స్థానాలు దక్కించుకోవాలి...ఇదీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో దాదాపు ప్రతి సభలో చెబుతున్న మాట. అయితే అలా చెప్పి వదిలేయడమే కాకుండా అందుకు అనుగుణంగా ఆయన రాజకీయ వ్యూహాలు రచించడం...వాటిని పార్టీ నేతలకు ఔపోసన పట్టించడం చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గం వారీగా స్పెషల్ ఫోకస్ పెట్టి వ్యూహాలు సిద్దం చేస్తున్నారు.
పార్టీకి సమయం...పెంచారు
ఇటీవలి దాకా పరిపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, పార్టీ కార్యక్రమాలకు తక్కువగా సమయం వెచ్చించిన చంద్రబాబు క్రమంగా పార్టీ కార్యక్రమాలు, సమీక్షలు, సమావేశాలకు సమయం పెంచుతూపోతున్నారు. తద్వారా ఎన్నికలకు తాము సమాయత్తం విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. ఇక పార్టీ కార్యక్రమాలపై మరింత దృష్టి పెట్టి నియోజకవర్గాల స్థాయిలో అవసరమైన సర్దుబాట్లు-దిద్దుబాట్లు అన్నీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
సమగ్ర...చర్చ,విశ్లేషణ
ఇందుకోసం నియోజకవర్గాల వారీగా తమ పార్టీ వివిధ కేటగిరీల నేతలతో తానే స్వయంగా మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే/నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే, ముఖ్యమైన ఒకరిద్దరు నేతలతో ఆల్రెడీ మీటింగ్ లు మొదలుపెట్టారు. ఒక్కో పార్లమెంటరీ నియోజక వర్గం వారీగా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఈ భేటీలు జరుగుతున్నాయి. టిడిపికి సంబంధించి నిఘా వర్గాలు, ఇతర సర్వే బృందాల ద్వారా సేకరించిన సమాచారం దగ్గర పెట్టుకుని ఆయా నేతలతో చంద్రబాబు మాట్లాడతారని తెలిసింది. అలా అందరి అభిప్రాయాలు తీసుకోవడం...తన వద్ద అప్పటికే సేకరించిన సమాచారాన్ని, వారు చెబుతున్న వాటిని సరిపోల్చుకోవడం చేస్తారని తెలిసింది.
కసరత్తు...మొదలైంది...
ఈ క్రమంలో ఇప్పటికే గుంటూరు, చిత్తూరు పార్లమెంటు స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది. అలాగే ఈ నెల 11వ తేదీన విజయనగరం పార్లమెంటు స్థానం పరిధిలోని శాసనసభ స్థానాల నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు 7 ఎంపీ స్థానాలు...వాటి పరిధిలోని 49 అసెంబ్లీ స్థానాల నేతలతో భేటీలు పూర్తిచేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది.
పరిస్థితిపై...అంచనా
ఈ విధంగా అన్ని అసెంబ్లీ స్థానాల నేతలతో తొలి విడత భేటీలను 2 నెలల్లో పూర్తిచేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. ఇంకా ఎన్నికలకు సుమారు 7 నెలలకు పైగా గడువు వుండగానే... ఈ కసరత్తు చేయడం ద్వారా సరైన సమయానికే ఒక కీలక అంచనాకు రావచ్చనేది చంద్రబాబు భావనగా తెలుస్తోంది. దీనివల్ల ఎక్కడైనా ఎమ్మెల్యేల పనితీరునో, లేక వారినో మార్చాల్సి ఉంటే ఆ పరిస్థితులపై ఒక అవగాహనకు రావడం, అందుకు అనుగుణమైన చర్యలు ఆరంభించడం చేయొచ్చనేది చంద్రబాబు యోచన. ఎవరి మనోభావాలు దెబ్బతినే పరిస్థితి లేకుండా చాకచక్యంగా ఈ పనులను కొలిక్కి తేవడం...అలాగే దాదాపు 50 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలన్న తన ఆలోచనకు అనుగుణంగా ఈ కసరత్తు ద్వారా ఆ పనిని సాఫీగా పూరిచేయడం చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది.