కాంట్రాక్టు ఉద్యోగులకు చంద్రబాబు షాక్, 800 మందికి మంగళం, మున్ముందు ఇంకెందరో?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంట్రాక్టు ఉద్యోగులకు ఊహించని షాకిచ్చారు. ఆయుష్ విభాగంలో పనిచేస్తున్న 800 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి : ఎన్నికల ముందు *బాబొస్తే జాబొస్తుంది..' అని ప్రకటనలతో పెద్ద ఎత్తున ఊదరగొట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంట్రాక్టు ఉద్యోగులకు ఊహించని షాకిచ్చారు.
తాజాగా ఆయుష్ విభాగంలో పనిచేస్తున్న 800 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయుష్ ఉద్యోగుల అవసరం లేదని, జీతాలు ఇవ్వలేమంటూ, వారిని ఇంటికి పంపించడని ఆదేశాలు జారీచేశారు.
ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా 2016-17సంవత్సరానికి పనిచేసిన 12 నెలల కాలానికి వేతనం కూడా ఇవ్వకూడదని నిర్దాక్షిణ్యంగా చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఒక్కసారిగా భయాందోళన మొదలైంది.
తాజా ఉత్తర్వుల నేపథ్యంలో భవిష్యత్లో ఇంకా ఎంత మందిని సర్కారు తొలగిస్తుందోనన్న భయం మొదలైంది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై ఆయుష్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి సురేష్ స్పందిస్తూ.. ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన చర్యకు ఒడిగట్టిందని, దీనిపై 800 మంది ఉద్యోగులు నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు.
అయితే ఆయుష్ ఉద్యోగుల తొలగింపు విషయంలో ఏపీ సర్కారు అత్యంత తెలివిగా వ్యవహరించింది. ఏప్రిల్ 20 నాటికే ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులు సిద్ధం చేశారు. కానీ వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తే వాళ్లంతా.. కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటారేమోనన్న అనుమానంతో ఏప్రిల్ 28 వరకూ జారీ చెయ్యలేదు. ఏప్రిల్ 28 నుంచి కోర్టుకు సెలవులు కావడంతో ఏప్రిల్ 30న ఆ ఉత్తర్వులను అన్ని ప్రాంతీయ సంచాలకులకు పంపించారు.