చూస్తూ ఊరుకోవాలా?: మోడీ వైపు మొగ్గిన చంద్రబాబు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం టిడిఎల్పీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, అంతకుముందు పార్టీ నాయకులతో జరిగిన భేటీలో తెలంగాణ అంశంపై స్పందించడంతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన ప్రశంసలు కురిపించారు. మోడీ పైన బాబు కితాబు బిజెపి - టిడిపి దోస్తీకి అనధికార సంకేతమని చెప్పవచ్చు.
విభజనలో సమన్యాయం కావాలంటూ చంద్రబాబు ఇటీవల జాతీయ నాయకులను కలిసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కాంగ్రెసు పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆయన అన్నారు. ప్రధాని అభ్యర్థిగా మోడీకి తిరుగు లేదన్నారు. మోడీకి ధీటుగా ఎవరు పని చేయడం లేదన్నారు. దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తోందన్నారు. ఢిల్లీలో అందరూ ఇదే చెబుతున్నారన్నారు. ఎన్నికలకు మరో 66 రోజులు మాత్రమే సమయం ఉందని తెలిపారు.
తెలంగాణ అంశంపై మాట్లాడుతూ... కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికలు వారి కుమ్మక్కు రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. 10 జన్పథ్ స్క్ర్పిటు ప్రకారం ఆ మూడు పార్టీలు పని చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం ఆదేశాలు తూచ తప్పకుండా పాటిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగు జాతితో ఆడుకోవద్దని, విద్వేషాలు రెచ్చగొట్టవద్దన్నారు.
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందన్నారు. కాంగ్రెసు నీచ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాజ్యసభ బరిలో నిలిచిన చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డిలు తప్పుకున్నారని గుర్తు చేశారు. తమ పార్టీ నుండి వెళ్లిన ఎమ్మెల్యేలను ఎందుకు అనర్హులుగా ప్రకటించలేదని ప్రశ్నించారు. నీతిమాలిన కాంగ్రెసు పార్టీని అడ్రస్ లేకుండా చేయాలన్నారు.
ఎమ్మెల్యేలను బజారులో వస్తువుల కంటే హీనంగా కాంగ్రెస్ కొనేదన్నారు. పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడడంలేదనుకున్నట్టు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నారు. కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతూ ఇష్టానుసారం రాజకీయం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. కాగా, అంతకుముందు పార్టీ నేతలతో మాట్లాడుతూ.. బిజెపితో పొత్తుపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.