బాబుకు కోపమొచ్చింది: సీఎం జోరు.. అధికారుల బేజారు!
హైదరాబాద్: విద్య, వైద్య, వాణిజ్య, సాంస్కృతిక రంగాలకు కూడలి అయిన విజయవాడ నగరాన్ని అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్ది మరింతగా అభివృద్ధి చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీనిచ్చారు. రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడలో శనివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు నగర మ్యాప్ చేతబట్టుకుని పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన జరిపారు. ఆకస్మిక తనిఖీలు చేశారు.
అంతకుముందు తెల్లవారుఝామున నిద్రలేచి అధికారులతో నగరాభివృద్ధి గురించి చర్చించారు. పర్యటన అనంతరం వివిధ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించి తదుపరి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గడచిన పదేళ్లలో ఒక్క విజయవాడే కాదు రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలు అధ్వాన్నంగా మారాయని, సమర్థవంతంగా పని చేసేవారు కూడా పని చేయకుండాపోయారని, అసలు పరిపాలన అనేది లేకుండా పోయిందన్నారు.
విజయవాడ నగరమంతా చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఉందని, తూర్పు నియోజకవర్గంలో రెండు లక్షల మంది పైగా మురుగునీరు తాగుతున్నారని, నగరపాలక సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రజలకు త్వరితగతిన సేవలందించాలనే దృష్టితో తాను పరుగులు పెడుతూ బహిరంగంగా అధికారులను నిలదీసేవాడినని చెప్పారు. ఆకస్మిక తనిఖీలు చేస్తూ అధికారుల గుండెల్లో నిద్రపోయానన్నారు.

అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా తన విధానాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని, అందరూ కలసిరావాలన్నారు. కష్టించే తత్వంగల అధికారులను స్వాగతిస్తున్నానని, పని చేయనివారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. విజయవాడలో తరచూ పర్యటిస్తూ ఆకస్మిక తనిఖీలు చేస్తానన్నారు. బకింగ్హామ్, ఇతర కాలువలను రూ.1500 కోట్లతో సుందరీకరణ చేసి జలరవాణాకు అనుకూలంగా తీర్చిదిద్దుతానన్నారు.
తూర్పు నియోజకవర్గంలో రూ.52కోట్లతో తాగునీటి ట్రీట్మెంట్ప్లాంట్ నిర్మాణం, రామలింగేశ్వరనగర్లో తొలిదశలో రూ.110 కోట్లతో కరకట్ట రిటైనింగ్వాల్ నిర్మాణం, రూ.50 కోట్లతో గన్నవరం విమానాశ్రయం రన్వే విస్తరణ పనులు, రూ.4కోట్లతో తుమ్మలపల్లి కళాక్షేత్రం అభివృద్ధి ఇలా అనేక ప్రాజెక్టులు చేపడతానంటూ ప్రకటించారు.
కాగా, చంద్రబాబు విజయవాడలో మూడు గంటలపాటు ఆకస్మిక తనిఖీలు చేసి ప్రజాప్రతినిధులు, అధికారులకు ముచ్చెమటలు పోయించారు. పాత ప్రభుత్వాసుపత్రులు కలియదిరిగి రోగులతో ముచ్చటించారు. ఆసుపత్రి ప్రాంగణం అపరిశుభ్రంగా కన్పించడం, వైద్యులు, నర్సులు ప్రసూతి కోసం లంచాల కోసం పీడిస్తున్నారంటూ పలువురు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై స్పందిస్తూ పక్కనే ఉన్న ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ను ప్రశ్నించారు. ఆసుపత్రి డెప్యూటీ సూపరింటెండెంట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో రక్తపరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసి పేదలకు ఉచితంగా రక్తపరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తానన్నారు. కళాక్షేత్రం వద్దనున్న డివైడర్ పైనుంచి ఆసుపత్రిలోకి వెళ్లేందుకు ఉన్న గేట్ సరిగ్గా పనిచేయకపోవటంపై మున్సిపల్ కమిషనర్ హరికిరణ్పై మండిపడ్డారు.












Click it and Unblock the Notifications