అసూయపడేలా: బాబు, ఎర్రచందనంతో రూ3వేల కోట్లు
హైదరాబాద్: అన్యాయం చేసిన వారు అసూయపడేలా ఏపీని దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చేస్తానని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తామన్నారు. తన నివాసం నుండి 13 జిల్లాల ప్రజాప్రతినిధులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
15వేల మంది ప్రజాప్రతినిధులతో మూడు దశల్లో ఈ సమావేశం సాగింది. పేదరికం మీద విజయం సాధించడమే నవ నిర్మాణ దీక్ష లక్ష్యమని, దీక్ష అంటే నిరాహార దీక్ష కాదని, ఇది ఎవరికీ వ్యతిరేకం కాదని సీఎం చంద్రబాబు అన్నారు.
జూన్ 2వ తేదీన నవ నిర్మాణ దీక్షను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, ఉత్సాహంగా పాల్గొనాలని, అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని శిక్షించడంతోనే పని పూర్తి కాలేదని, కసిని కృషిగా మలుచుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.
రాష్ట్ర విభజన మన ముందు కొన్ని సవాళ్లు విసిరిందని, సవాళ్లను అవకాశంగా మలుచుకుని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేసుకుందామన్నారు. జూన్ 2వ తేదీన నిర్వహించనున్న నవ నిర్మాణ దీక్షను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పేదరికానికి వ్యతిరేకంగా అందరూ సమిష్టిగా విజయం సాధించేందుకు సంకల్ప దీక్ష అన్నారు.
అన్యాయం చేసిన వాళ్లే అసూయపడే విధంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా రూపొందాలని ఆయన ఆకాంక్షించారు. జూన్ 3వతేదీ నుంచి 7వ తేదీ దాకా పేదరికంపై గెలుపు అంశాన్ని ఫోకస్ చేస్తామన్నారు. వచ్చే మంగళవారం నుంచి డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.3 వేలు జమచేయనున్నట్లు ఆయన చెప్పారు.

వృద్ధులు, వితంతువులకు పెన్షన్లను ఐదు రెట్లు చేశామని, వికలాంగులకు మూడు రెట్లు పెంచామని వివరించారు. అభివృద్ధి, సంక్షేమం తన ప్రభుత్వానికి రెండు కళ్లని అభివర్ణించారు. ఇంతవరకు రూ. 24వేల కోట్లతో రైతు రుణ ఉపశమనం కలిగించామని, రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ. 7016 కోట్లు జమ చేశారన్నారు.
డ్వాక్రా మహిళలకు రూ. 10 వేల కోట్ల ఆర్ధిక సహాయం అందిస్తామన్నారు. వృద్ధులు, వితంతువులకు పెన్షన్లను ఐదు రెట్లు చేశామని, వికలాంగులకు మూడు రెట్లు పెంచామన్నారు. రూ.300 కోట్లతో చంద్రన్న సంక్రాంతి కానుక అందించామన్నారు.
పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేస్తామని, ఇందుకు నాలుగేళ్ల ముందే కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించి కరవు రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామన్నారు. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు క్యాంపెయిన్లు జన్మభూమి, మా ఊరు, స్మార్ట్విలేజి, స్మార్ట్ వార్డు, స్వచ్ఛాంద్రప్రదేశ్, మేడ్ ఇన్ ఆంధ్ర, డిజిటల్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.
రాష్ట్రాన్ని నిరంతర విద్యుత్ సరఫరాకు కేంద్రం ఎంపిక చేసిందన్నారు. పారిశ్రామికీకరణ, ఐటి ద్వారానే యువతకు భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు సాధ్యమన్నారు. ఏపీని 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన 3వ రాష్ట్రంగా, 2029 నాటికి అగ్రగామి రాష్ట్రంగా, 2050 కల్లా ప్రపంచ దేశాల పెట్టుబడులకు గమ్యస్ధానంగా చేద్దామన్నారు.
మరో సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ... సీజ్ చేసిన ఎర్ర చందనం దుంగలను అమ్మడం ద్వారా ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఆర్జించిందని చెప్పారు. ఓసారి రూ.1000 కోట్లు, మరోసారి రూ.2,000 కోట్లు వచ్చాయని చెప్పారు.












Click it and Unblock the Notifications