2 కుండలు పగులగొట్టి... జగన్ ఎక్కడ దాక్కున్నావ్: బాబు ఆగ్రహం, మోడీ సభకు వైసీపీ సహకారం
అమరావతి/గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ టీడీపీ, లెఫ్ట్ పార్టీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. గో బ్యాక్ మోడీ అంటూ కుండలు బద్దలు కొట్టి ఆందోళనలు చేపట్టారు. పలుచోట్ల ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఏపీకి ద్రోహం చేసిన మోడీ గో బ్యాక్ అని ఫ్లెక్సీలు, ప్లకార్డులు ప్రదర్శించారు. నల్ల జెండాలు, టైర్లు తగులబెట్టి టీడీపీ నేతలు నిరసన తెలిపారు. జిన్నా టవర్ సెంటర్లో మోడీ ఫ్లెక్సీని చించివేశారు. పోలీసులు అడ్డుకున్నారు.

టీడీపీ నిరసన, మోడీ పర్యటనకు భద్రత కట్టుదిట్టం
విజయవాడ బెంజ్ సర్కిల్లో తెలుగు యువత నిరసన చేపట్టింది. నల్ల చొక్కాలు, బ్యాడ్జీలతో దేవినేని అవినాశ్, గద్దె రామ్మోహన రావు నిరసన తెలిపారు. గుంటూరు టవర్ సెంటర్లో టీడీపీ ధర్నా, రాస్తా రోకో చేపట్టింది. నేడు (ఆదివారం) ఉదయం పదింపావుకు మోడీ గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు. గం.11.05 నిమిషాలకు బుడంపాడు హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం గం.11.15 నిమిషాలకు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. గం.11.30కు బీజేపీ నిర్వహిస్తున్న ప్రజా చైతన్య సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం గం.12.30కు గన్నవరం నుంచి కేరళ వెళ్లనున్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో ఆదివారం చంద్రబాబు మరోసారి భగ్గుమన్నారు. టీడీపీ, లెఫ్ట్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. మోడీ పర్యటన సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశారు. 1700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

జగన్ సహకారంతో మోడీ సభ... ఎక్కడ దాక్కున్నావ్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతోనే ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరులో బహిరంగ సభ నిర్వహిస్తున్నారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీ, జగన్లు మనకు అక్కరలేదన్నారు. రెండు కుండలు బద్దలు కొట్టి నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎక్కడ దాక్కున్నావ్ జగన్.. నినాదంతో ఆందోళనకు అధినేత పిలుపునిచ్చారు. ఏపీ ప్రజలను ఎగతాళి చేసేందుకే మోడీ వస్తున్నారని విమర్శించారు. మోడీ రాకను వైసీపీ మినహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఆయన ఉదయం టీడీపీ నేతలు, కార్యకర్తలతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

విపక్షాలం కలిసి మోడీని గద్దె దింపుతాం
ఏపీపై యుద్ధం చేయడానికి ప్రధాని మోడీ నేడు వస్తున్నారని, ఆయనకు ఏపీ ప్రజల నిరసన ఎలా ఉంటుందో తెలియజేయాలని చంద్రబాబు అన్నారు. వ్యాఖ్యానించారు. మోడీ నేతృత్వంలో దేశంలోని వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని, ఆయన తన స్వార్థంతో దేశాన్ని భ్రష్టు పట్టించారన్నారు. ఈశాన్య రాష్ట్రాలన్నీ బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలన్నీ కలిసి ఆయనను అధికారానికి దూరం చేయనున్నామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో మోడీపై తీవ్రమైన ఆగ్రహం ఉందన్నారు. ఆయన ఏ రాష్ట్రానికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛదంగా ముందుకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారన్నారు.

మోడీ సభకు వైసీపీ జనాన్ని తరలిస్తోంది
రాష్ట్ర ప్రజలను ఎగతాళి చేయడానికే ఆయన నేడు ఏపీలో పర్యటించాలని నిర్ణయించుకున్నారని, నిరసనలన్నీ శాంతియుతరంగా సాగాలని, ప్లజలు తమలోని ఆగ్రహాన్ని మోడీకి తెలిసేలా చేయాలని చంద్రబాబు అన్నారు. మోడీ సభకు ప్రజలను తరలిస్తామని వైసీపీ నాయకులు ఇచ్చిన హామీ మేరకే మోడీ, తన పర్యటనను ఖరారు చేసుకున్నారని ఆరోపణలు చేశారు.
కన్నా లక్ష్మీనారాయణ వైసీపీకి ఏజెంట్ వంటి వాడని, అరాచక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మోడీ ప్రయాణిస్తున్న మార్గంలో రెండు కుండలను పగులగొట్టాలన్నారు. ఈ రెండు కుండలూ బీజేపీ, వైసీపీలను సూచించాలన్నారు. రాష్టానికి అన్యాయం చేసిన మోడీని ప్రశ్నించడంలో జగన్ విఫలమయ్యారన్నారు. తాను మోడీపై అవిశ్వాసాన్ని పెడితే, తన ఎంపీలతో రాజీనామా చేయించిన ఘనత జగన్ది అన్నారు. రాజీనామాలతో మోడీ సర్కారుకు మేలు చేయించినట్లయిందన్నారు. తెలుగు జాతికి జగన్ తక్షణం క్షమాపణలు చెప్పాలని లేకుంటే ప్రజలు క్షమించరన్నారు.












Click it and Unblock the Notifications