డబ్బు పంపిణీపై బాలకృష్ణకు ఈసీ షాక్: అఖిలపై జగన్ ప్రతాపమా, నన్ను తిడితే: బాబు
హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ నంద్యాల రోడ్డు షోలో పాల్గొన్న సమయంలో డబ్బులు పంచుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లాయి.
నంద్యాల: హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ నంద్యాల రోడ్డు షోలో పాల్గొన్న సమయంలో డబ్బులు పంచుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లాయి.
విచారణకు ఆదేశించిన ఈసీ
దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ఈ అంశంపై విచారణ జరపాలని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణను ఆదేశించింది.
నన్ను తిడుతుంటే మీకు బాధేయడం లేదా?
తనను నడి రోడ్డుపై కాల్చేయాలని, ఉరేయాలని, తన బట్టలు ఊడదీయాలన్న జగన్ను ఓటుతోనే ఖతం చేయాలని, చిరునామా గల్లంతు చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన శనివారం నంద్యాలలో పర్యటించారు. తనను ఎందుకు కాల్చాలి, ఉరేయాలి? నేనేం తప్పుచేశానని ప్రశ్నించారు. జగన్ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మీకు బాధేయడం లేదా అని ప్రశ్నించారు. అందుకే ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.
తల్లిదండ్రులు లేని పిల్లల్ని గుర్తుకు తెచ్చుకోండి
ఓటు వేసే ముందు భూమాను, తల్లిదండ్రులు లేని వారి పిల్లలను గుర్తుకు తెచ్చుకోవాలని చంద్రబాబు అన్నారు. నంద్యాల్లో పులివెందుల సంస్కృతి తీసుకొస్తానని జగన్ అంటున్నారని, ఇది జరిగితే పిల్లలకు అన్నప్రాసన రోజున పెన్ను, పుస్తకానికి బదులు తుపాకులు, బంగారు బిస్కెట్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
అఖిలప్రియపై ప్రతాపమా, శిల్పా ఏం చేస్తారు
భూమా నాగిరెడ్డి పిల్లల పైనా జగన్ ప్రతాపాన్ని చూపుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వారిని మీరే తల్లిదండ్రులుగా ఆదరించాలన్నారు. మంత్రిగా అభివృద్ధి చేయని శిల్పా మోహన్ రెడ్డి తన ప్రభుత్వం హయాంలో ఏం చేస్తారని నిలదీశారు.
పులివెందులనే నంద్యాలలా నేను మారుస్తా
పులివెందులనే నంద్యాలలా శాంతియుతంగా మారుస్తానని చంద్రబాబు అన్నారు. అభివృద్ధికి అడ్డం పడితే బుల్లెట్లా దూసుకుపోతానన్నారు. భూమా బ్రహ్మనంద రెడ్డిని ఎంత మెజారిటీతో గెలిపిస్తే తనకు అంత టానిక్ అన్నారు. మెజారిటీ 50-60వేలు అన్నది మీకే వదిలేస్తున్నానని చెప్పారు.
సాక్షి చదివితే చికాకు
జగన్ తనకు పత్రిక, ఛానల్, ఆస్తులు లేవంటున్నారని, ఆయనకు ఉన్న సాక్షి పత్రికలో అసత్యాలన్నీ రాస్తున్నారని చంద్రబాబు అన్నారు. అవి చదివితే చికాకు వస్తుందని, సాక్షి టీవీలో 24గంటలూ దుష్పప్రచారం చేస్తున్నారన్నారు. రూ.లక్ష కోట్ల అవినీతి సొమ్ముకు వివరాలు అడిగితే చెప్పడం లేదన్నారు.
నాకు తిండి తెచ్చే వాహనాన్ని తనిఖీ చేయించారు
జగన్ ఓటర్ల గడ్డం, బుగ్గలు పట్టుకుంటూ ఏదో చేసినట్టు నటిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తన కోసం తిండిని తీసుకువచ్చే వాహనాన్నీ తనిఖీ చేయించారని, అందులో రాగులు, సజ్జలు, కూరగాయలు ఉండడంతో వారికి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లయిందన్నారు.