మాతో పోటీ పడు: కిరణ్కు బాబు, తమ్ముళ్లకు పిలుపు
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలతో రైతులు నష్టాల్లో మునిగిపోతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం మండిపడ్డారు. సచివాలయం సమత బ్లాకు ఎదుట వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టిడిపి నేతలు ఆందోళన చేస్తే వారిని పోలీసులు అరెస్టు చేసి సైఫాబాద్ పోలీసు స్టేషన్కు తరలించారు. బాబు అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
రైతులను ఆదుకోవాలని తమ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తే అరెస్టు చేసి జైళ్లో పెట్టడమేమిటని ప్రశ్నించారు. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా కిరణ్ తీరు ఉందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత లేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఆదుకున్నామన్నారు. ఆపత్కాలంలో టిడిపి ఆదుకునేందుకు ముందుంటుందన్నారు.
కిరణ్ సేవాభావంలో తమతో పాటు పడాలని హితవు పలికారు. కిరణ్ ప్రతాపం తమ పైన చూపించకుండా సేవ చేయడంలో చూపించాలన్నారు. నీలం తుఫాను బాధితులకు ఇప్పటి వరకు నష్ట పరిహారం ఇవ్వలేదని, ఫైలిన్ తుఫాను బాధితులను ఆదుకోలేదని ఆరోపించారు. ఓ పక్క రాష్ట్రం సమస్యల్లో చిక్కుకుంటే కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఓ పక్క తెలంగాణ రాష్ట్ర సమితి, మరోపక్క వైయస్సార్ కాంగ్రెసు పార్టీని పెట్టుకొని ప్రజలతో ఆడుకుంటోందని నిప్పులు చెరిగారు.
బాధితులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆదుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆదుకోకున్న మనం ఆదుకుందామని తెలుగు తమ్ముళ్లకు సూచించారు. వరద సహాయక చర్యల్లో కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. ఎన్టీఆర్ ట్రస్టు తరఫున సహాయ కార్యక్రమాలు చేపడతామన్నారు. సహాయక చర్యల్లో పాల్గొనవల్సిన అధికారులు విభజనపై ఢిల్లీకి నివేదికలు పంపించడంలో బిజీగా ఉండటం దారుణమన్నారు. ఈ సమయంలో నివేదికలు అవసరమా అని ప్రశ్నించారు.