ఎత్తుకు పైఎత్తు: చంద్రబాబు దీక్ష రోజే జగన్ అనూహ్య నిర్ణయం తీసుకుంటారా?
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దీక్షలు చేయనుంది. అయితే, చంద్రబాబు దీక్ష రోజే జగన్ అనూహ్య నిర్ణయం తీసుకోవచ్చుననే ప్రచారం సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం మే నెలలో జగన్ పాదయాత్ర ముగుస్తుంది.
నేను ఒక్కడినే: దేవినేని అవినాశ్కు లోకేష్ హామీ, 'టచ్లో 10మంది వైసీపీ ఎమ్మెల్యేలు'
కాస్త అటూ ఇటు అయినా ఆయన ప్రజా సంకల్ప యాత్ర అనంతరం తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని నిర్ణయించారని వార్తలు వచ్చాయి. అయితే ఈ నిర్ణయాన్ని ఆయన ముందుకు జరపడం లేదా ఏ రోజు రాజీనామా చేస్తారో స్పష్టంగా చెప్పడం చంద్రబాబు దీక్ష చేసే రోజు ప్రకటించే అవకాశముందని అంటున్నారు. దీక్ష పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
దీక్ష రోజు రాజీనామాలు కొట్టి పారేయలేని పరిస్థితి
లేదంటే చంద్రబాబు దీక్ష రోజే రాజీనామాలు చేసినా కొట్టి పారేయలేమనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో ప్రత్యేక హోదా అంశంపై ఆధిపత్య పోరు కనిపిస్తోంది. టీడీపీ, వైసీపీలు హోదా క్రెడిట్ సొంతం చేసుకునే పనిలో ఉన్నాయి. బీజేపీ మాత్రం హోదాకు సమానమైన ప్యాకేజీ అని చెబుతోంది. హోదా పేరుతో మిగతా పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆరోపిస్తోంది.
అలా చేస్తే మైలేజీ
ఇలాంటి సమయంలో చంద్రబాబు దీక్ష చేస్తున్నారు. హోదా విషయంలో టీడీపీ, వైసీపీలు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు దీక్ష అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి కౌంటర్గా తన పాదయాత్ర ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడానికి బదులు.. చంద్రబాబు దీక్ష రోజే చేయిస్తే మైలేజీ వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారని సమాచారం.
చంద్రబాబుపై మరింత ఒత్తిడి
తద్వారా చంద్రబాబుపై మరింత ఒత్తిడి తీసుకు రావొచ్చునని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీల రాజీనామా ద్వారా టీడీపీని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. రాజ్యసభ ఎంపీల రాజీనామాపై టీడీపీ ప్రశ్నిస్తే.. నాడు బోఫోర్స్ కుంభకోణం సమయంలో మీరు అలాగే చేశారుగా అని కౌంటర్ ఇచ్చారు. దీంతో టీడీపీని కార్నర్ చేసే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయిస్తే మరింత ఒత్తిడి తీసుకు రావొచ్చునని భావిస్తున్నారట. అయితే, ఈ నిర్ణయం ఫైనలైజ్ కాలేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని వైసీపీ నేత అంబటి రాంబాబు గురువారం వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామా అంశంపై మాట్లాడుతూ.. ఆ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, 22న కూడా జగన్ ఎంపీలు, సమన్వయకర్తలతో భేటీ అవుతారని, ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.
ఢిల్లీలోని పరిణామాలు వివరణ
2019 ఎన్నికలకు తెలుగుదేశం పార్టీకి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక హోదా అంశమే నినాదం. ఇప్పుడు ఇదే నినాదం కోసం వారి మధ్య క్రెడిట్ పోరు సాగుతోంది. బుధవారం వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, వైయస్ అవినాశ్ రెడ్డిలు జగన్ను కలిశారు. కార్యాచరణపై చర్చించారు. ఢిల్లీలోని పరిణామాలను వారు అధినేతకు వివరించారు. హోదాపై కార్యాచరణను త్వరలో ఖరారు చేద్దామని చెప్పారు.
జగన్@1800 కిలో మీటర్లు
ఇదిలా ఉండగా, జగన్ పాదయాత్ర బుధవారం 1800 కిలో మీటర్లకు చేరుకుంది. ఉదయం మైలవరం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. వెల్వడం మీదుగా గణపవరం గ్రామంలో అడుగు పెట్టారు. అక్కడితో ఆయన పాదయాత్ర 1800 కిలో మీటర్లకు పూర్తయింది. కాగా, ఆయన గురువారం పాదయాత్ర కొనసాగించి, ఆ తర్వాత శుక్రవారం కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ బయలుదేరనున్నారు.