ఏంమాటలవి, జాగ్రత్త!: షర్మిల-విజయమ్మలను లాగిన రాజేంద్రప్రసాద్కు బాబు క్లాస్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటనపై టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది.

రాజేంద్ర ప్రసాద్ ఆరోపణలు
జగన్పై దాడి ఘటన విషయంలో టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం సాగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాజేంద్రప్రసాద్ వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, షర్మిలను లాగారు. జగన్ తమను రాజకీయంగా ఎదగనీయడం లేదని, వారే జగన్ను చంపడానికి కుట్ర పన్ని ఉండవచ్చునని, ఆయన ఫోటో పెట్టుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావించి ఉంటారని సంచలన ఆరోపణలు చేశారు.

వ్యాఖ్యలు హుందాగా లేవు
రాజేంద్రప్రసాద్ ఆరోపణలపై చంద్రబాబు మందలించారని తెలుస్తోంది. ఆరోపణలు హుందాగా ఉండాలని, ఇలాంటి విషయాలలో మాట్లాడే సమయంలో మరింత సంయమనం పాటించాలని ఆయనకు సూచించారు. ఆయన వ్యాఖ్యలు హుందాగాలేవని చెప్పారు.

వ్యక్తిగత విమర్శలు వద్దు
రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగత విమర్శలు వద్దని చెప్పారు. జగన్పై దాడి వ్యవహారానికి సంబంధించి ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయవద్దని, ఆచితూచి మాట్లాడాలని పార్టీ నేతలకు చెప్పారు. రాష్ట్రంలో మరే సమస్యా లేనట్టు వైసీపీ నాయకులు కొన్ని రోజులుగా అదే అంశాన్ని చర్చకు పెడుతున్నారన్నారు.

అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేదు
దానిపై మనం (టీడీపీ నాయకులు) అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేదని చంద్రబాబు నేతలకు సూచించారని తెలుస్తోంది. వైసీపీ వలలో చిక్కుకోవద్దని పార్టీ నాయకులకు చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయం, టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకే ప్రాధాన్యమివ్వాలని సూచించారు.












Click it and Unblock the Notifications