సరైన టైంలో చెప్తా, జగన్ వల్ల బాధపడ్డా: పవన్ 'సింగపూర్'పై బాబు కౌంటర్
అమరావతి: తనపై విమర్శలు గుప్పిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన తన కృష్ణా జిల్లా పర్యటనలో జగన్, పవన్లతో పాటు ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
పవన్ కళ్యాణ్ దూకుడు: చిరు ఫ్యాన్స్ తర్వాత, జనసేనలోకి లోక్సత్తా నేతలు
కురుక్షేత్రయుద్ధంలో ధర్మం గెలిచినట్లే భవిష్యత్తులో తెలుగు జాతిది, తెలుగుదేశం పార్టీదే విజయం అన్నారు. ఏపీకి న్యాయం చేయమంటూ తాను ఇరవై తొమ్మిదిసార్లు ఢిల్లీకి వెళ్లానని, తాను అన్నిసార్లు వెళ్లినా పెడచెవిన పెట్టడంతో మోసం చేస్తున్నారని తనకు అనిపించిందని, అందుకే ఎన్డీయే నుంచి వైదొలిగామని చెప్పారు.
మోడీని నిలదీసిన ఘనత కేశినేని నానిదే
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు. అవిశ్వాసంతో మన ఎంపీలు ఢిల్లీని గడగడలాడించారన్నారు. అవిశ్వాస తీర్మానం సమయంలో ఎంపీ కేశినేని నాని బాగా మాట్లాడారని కితాబిచ్చారు. పార్లమెంటులో మోడీని నిలదీసిన ఘనత ఆయనదే అన్నారు. మనం పార్లమెంటులో పోరాడితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాత్రం రాజీనామా చేసి పారిపోయారని విమర్శించారు.
పవన్ సింగపూర్ వ్యాఖ్యలపై గట్టి కౌంటర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు రాజధాని అమరావతి విషయంలో గట్టి కౌంటర్ ఇచ్చారు. సింగపూర్ వంటి పాలన కావాలని పవన్ చెబుతున్నారని, కానీ అదే సీంగపూర్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విశ్వసించిందని గుర్తించాలని సూచించారు. పవన్ మాట మార్చారని, రూటు మార్చారని ఎద్దేవా చేశారు. ఇటీవల పవన్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఏమైనా అంటే సింగపూర్ వంటి రాజధాని అంటారని, కానీ సింగపూర్ వంటి పాలన మాత్రం అనరని ఎద్దేవా చేశారు. దీనిపై చంద్రబాబు పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.
జగన్ తిట్టినా ప్రజల కోసం భరిస్తున్నా
వైయస్ జగన్ పసలేని, పద్ధతి లేని విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఆయన వ్యాఖ్యలకు ఒక్కోసారి బాధ వేస్తున్నా ప్రజల కోసం భరిస్తున్నానని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత లేని పార్టీ అన్నారు. డబ్బుల సంపాదన కోసమే, కేసుల మాఫీ కోసం వచ్చిన పార్టీ అన్నారు. బీజేపీ నేతలు కూడా విభజన హామీలపై రోజుకో మాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ అంశాలపై బీజేపీ నేతలకు స్పష్టత లేదన్నారు.
మేం చెప్పింది చేస్తాం, చేసేదే చెబుతాం
తాను మాట మీద నిలబడే వ్యక్తినన్న జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. మేం చేసేదే చెబుతామని, చెప్పిందే చేస్తామని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచించాలన్నారు. విభజన నేపథ్యంలో కట్టుబట్టలతో వచ్చామని, నానా ఇబ్బందులు పడ్డామని చెప్పారు. తప్పు చేస్తేనే భయం ఉంటుందని, ప్రతిపక్ష నేతలు మనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు.
విభజనతో అందరూ ధైర్యం కోల్పోయారని, తనను నమ్ముకున్న వాళ్ల కోసం కేంద్రంపై తిరుగుబాటు చేశానని చెప్పారు. పాదయాత్రలో కొందరు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. వైసీపీ నేతలను నమ్మి హోదా ఉద్యమం చేస్తే ఏమీ ఉండదన్నారు. సింగపూర్ పైసా తీసుకోకుండా కేపిటల్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని చెప్పారు.
సరైన సమయంలో సమాధానం ఇస్తా
ఎవరికైనా పదవి ముఖ్యం కాదని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. మాట తప్పింది, మడమ తిప్పింది కేంద్రమే అన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మనం ముందుకు పోతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందన్నారు. ఏపీకి రాజధాని లేదని, ఆదాయం లేదన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. హోదా, విభజన హామీలపై కేంద్రం మోసం చేసిందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హక్కులు సాధించే వరకు రాజీపడేది లేదన్నారు. రాష్ట్రం కోసం విమర్శలను భరిస్తానని, త్వరలో సరైన సమాధానం ఇస్తానని చెప్పారు. తనను పరిణితి నాయకుడు అని ప్రధాని పార్లమెంటులో అన్నారని, వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు ఇస్తే అన్యాయం చేసిన వారికి సరైన గుణపాఠం చెబుతామన్నారు.