విశ్వాసం ఉందట, అవిశ్వాసం పెడుతారట: జగన్పై చంద్రబాబు
Recommended Video
అమరావతి: ప్రధాని మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదించాలని వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తలపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చకు సోమవారం ఆయన శాసనమండలిలో సమాధానమిచ్చారు.
ప్రధాని మోడీపై విశ్వాసం ఉందని వైసిపి పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి చెప్పారని, విశ్వాసం ఉందని చెప్పిన వైసిపి అవిశ్వాస తీర్మానం ఎలా పెడుతుందని ఆయన అన్నారు. అలా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న వైసిపి పెట్టే అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఎలా ఇస్తామని ఆయన అడిగారు.
విధిలేక రాజీనామాలు...
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని అంటూ ఇతర హామీల విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏమీ ఇవ్వలేమని చెప్పిన తర్వాత తమ మంత్రుల చేత రాజీనామా చేయించాలని నిర్ణయం తీసుకున్నానని చంద్రబాబు చెప్పారు. ఆ విషయం చెప్పడానికి నరేంద్ర మోడీతో మాట్లాడడానికి ప్రయత్నించానని, కానీ ఫలితం లేకుండా పోయిందని, దాంతో తమ మంత్రులు రాజీనామా చేస్తారని రాత్రి 11 గంటలకు ప్రకటించానని ఆయన వివరించారు.
మనమేమీ ఎక్కువ కోరడం లేదు...
తాము ఎక్కువ ఏమీ కోరడం లేదని, ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామని, అయితే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అరుణ్ జైట్లీ ప్రకటన వల్లే మంత్రుల చేత రాజీనామా చేయించాలనే నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేయవద్దని జాతీయ పార్టీలను కోరినట్లు ఆయన తెలిపారు.
హేతుబద్దత లేని విభజన..
తాను ఇప్పటి వరకు 8 శ్వేత పత్రాలు విడుదల చేసినట్లు చంద్రబబు చెప్పారు. హేతుబద్దత లేకుండా రాష్ట్రాన్ని విభజించారని ఆయన విమర్సశించారు. ప్రత్యేక హోదా, జాతీయ ప్రాజెక్టుగా పోలవరం, ఆర్థిక లోటు భర్తీ వంటి హామీలను ఆయన ప్రస్తావించారు. విభజన చట్టంలో పెట్టిన అంశాలను, రాజ్యసభలో కేంద్రం ఇచ్చిన హామీలను ఆయన ప్రస్తావించారు.
కోల్డ్ స్టోరేజీలో ప్రత్యేక హోదా
రాష్ట్రానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని రాజ్యసభలో హామీ ఇచ్చిన తర్వాత దానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దాన్ని అమలు చేయాలని ప్రణాళికా సంఘానికి పంపించిందని, దాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టి జాతీయ అభివృద్ధి మండలికి సిఫార్సు చేసిందని ఆయన వివరించారు. హోదాను పదేళ్లు ఇస్తామని బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిందని అన్నారు.
నేను ఎవరినీ విమర్శించలేదు...
తాను అసెంబ్లీలో ఎవరినీ విమర్శించలేదని, పునర్వ్యస్థీకరణ బిల్లును చదివి వినిపించానని చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మన రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరని ఆయన అడిగారు. విధిలేని స్థితిలో కేంద్ర మంత్రుల చేత రాజీనామాలు చేయించానని చెప్పారు.
నేను ఎందుకు మాట్లాడకూడదు..
ఎపిని ఆదుకోవాల్సిన కేంద్రం తప్పించుకుంటోందని, ఇటువంటి స్థితిలో తాను ఎందుకు మాట్లాడకూడదని చంద్రబాబు అన్నారు. ప్రజలంతా ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. గత 35 ఏల్లుగా రాష్ట్ర ప్రయోజనానల కోసమే తాను దైర్యంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తనకు ఎవరి మీదా వ్యక్తిగత ద్వేషం లేదని, ఎవరి మీదా కోపం లేదని అన్నారు.
హైదరాబాదు నుంచి పంపించారు..
తాము విభజన వద్దన్నామని, అయినా బలవంతంగా హైదరాబాదు నుంచి పంపించారని, అందువల్ల తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన అన్నారు. హైదరాబాదుకు అన్ని సౌకర్యాలు వచ్చాయంటే తన కష్టమే ఉందని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా, రాయితీలు మా హక్కా, కాదా చెప్పాలని ఆయన అడిగారు.