అంతా చంద్రబాబే: కేఈ అసంతృప్తి, జగన్ ఇంప్రూవ్ అయ్యారని...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అసెంబ్లీ లాబీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు పైన ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని విషయాలు ముఖ్యమంత్రి తానే మాట్లాడుతున్నారని, ఇతర మంత్రులకు అవకాశం ఇవ్వడం లేదని అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి మాట్లాడిన కొన్ని సందర్భాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతున్నాయని వ్యాఖ్యానించారు. సాగునీటి రంగంలో మొదటి ప్రాధాన్యం రాయలసీమకు ఇవ్వాలన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రికి తాను స్ఫష్టంగా చెప్పానన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తామేమీ వాళ్లను పిలవడం లేదని, రాజధాని శంకుస్థాపనకు మరో రెండేళ్లు పట్టవచ్చునని చెప్పారు. రాజధానిని ఎంతైనా అభివృద్ధి చేసుకోవచ్చునని తెలిపారు.
వనరులన్నీ సిద్ధమయ్యాక రాజధానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. మరోవైపు, జగన్ గురించి మాట్లాడుతూ.. గతంలో కంటే వైయస్ జగన్ ఇంప్రూవ్ అయినట్లుగా కనిపిస్తోందన్నారు. రాజధానికి భూములు ఇవ్వవద్దనుకునే రైతులకు జగన్ ప్రసంగం సంతృప్తినిచ్చి ఉంటుందని వ్యాఖ్యానించారు.
అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. కొల్లేరు సరస్సును చంద్రబాబు తవ్విస్తే, వైయస్ పూడ్చివేసినట్లు అధికార సభ్యులు చెబుతున్నారని సభలో ఎద్దేవా చేశారు. అక్రమ చెరువులు తొలగించాలని సుప్రీం కోర్టు 2006లో ఆదేశిస్తే అప్పటి ముఖ్యమంత్రి వైయస్ చెరువులు తొలగించడం జరిగిందన్నారు.
అనంతరం అసెంబ్లీలో కొల్లేరు కాంటూరు పైన ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందన్నారు. అనంతరం ఆరు నెలలకే దురదృష్టవశాత్తూ వైయస్ చనిపోయారని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ సమస్య పైన పట్టించుకోలేదని నాని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో సమస్యను పరిష్కరించాలన్నారు.